టెలికాం మార్కెట్లో తమకు చుక్కులు చూపిస్తున్న రిలయన్స్ జియోకు ఎలాగైనా ఝలక్ ఇవ్వాలని టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ సన్నద్ధమవుతోంది. ఇప్పటి వరకు జియో మాత్రమే అందిస్తున్న వాయిస్ఓవర్ ఎల్టీఈ(వోల్ట్) కాలింగ్ సర్వీసులను, ఎయిర్టెల్ కూడా ఇక ఉచితంగా అందించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం ముంబైలో ఈ సర్వీసులను ఎయిర్టెల్ లాంచ్ చేస్తుందని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. వోల్ట్ కాల్స్తో 4జీ డేటా నెట్వర్క్ను వాడుకోవచ్చని, కస్టమర్లకు ఇవి పూర్తిగా ఉచితంగా అందించనున్నట్టు తెలుస్తోంది.
ఎయిర్టెల్ వోల్ట్ కాల్స్ ఫీచర్ను అందుకోబోతున్న తొలి నగరం ముంబైనే. అనంతరం ఢిల్లీ, కోల్కత్తాతో పాటు అన్ని నగరాల్లో వీటిని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఎయిర్టెల్ ఈ కాల్స్ ట్రయల్స్ను కూడా నిర్వహించిందని రిపోర్టులు చెప్పాయి. గతేడాది జియో మార్కెట్లోకి ప్రవేశించాక, వోల్ట్ సర్వీసులు చాలా పాపులర్ అయ్యాయి. 4జీ సేవలు మరింత వేగంగా విస్తరించడానికి ఈ సర్వీసులు ఎంత గానో సహకరిస్తాయి. వోల్ట్ సర్వీసులతోనే జియో అపరిమిత ఉచిత కాల్స్ను తన యూజర్లకు అందిస్తోంది. వోల్ట్ సేవలు వినియోగించుకోవాలంటే ఫోన్ యూజర్లకు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సపోర్టు కావాల్సి ఉంటుంది.
జియో వోల్ట్ కాల్స్ సేవలను ప్రారంభించిన అనంతరం చాలా స్మార్ట్ఫోన్లు వోల్ట్ సేవలకు అనుగుణంగా మార్కెట్లోకి వస్తున్నాయి. చాలా పాత ఫోన్లు, ఫీచర్ ఫోన్లు మాత్రమే ఈ సేవలను వాడుకోవడానికి వీలుండదు. ఫీచర్ ఫోన్ యూజర్లను టార్గెట్గా చేసుకుని కూడా జియో తాజాగా ఉచిత కాల్స్ సపోర్టుతో జియోఫోన్ను తీసుకొచ్చింది. జియోతో పాటు ఎయిర్టెల్ కూడా ఫ్రీ వోల్ట్కాల్స్ సపోర్టుతో సొంతంగా 4జీ ఫీచర్ఫోన్ తీసుకురావాలని భావిస్తోంది. మైక్రోమ్యాక్స్, ఇంటెల్ వంటి దేశీయ కంపెనీలతో భాగస్వామ్యం కూడా ఏర్పరచుకున్నట్టు టాక్.