ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే సోషల్ మీడియాలో పాదయాత్ర వాయిదాకు సంబందించి అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విజయవాడలో వైసీపీ రాష్ట్ర కార్యాలయం సిద్ధం కాకపోవడం., అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర కలిసి రాదనే సన్నిహితుల సూచనతో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వాయిదా పడిందని.. అక్టోబర్ 27 జగన్కు అనుకూలించదని జ్యోతిష్యులు హెచ్చరించడంతోనే వాయిదా వేశారని.. కోర్టు కేసులు, పార్టీ కార్యక్రమాలు ఆలస్యం కావటం వంటి అంశాల వల్ల వాయిదా పడిందని ఇలా అనేక రక రకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
అయితే అసలు విషయం ఏంటంటే.. ఆర్నెల్ల పాటు ప్రజల్లో ఉండేలా జగన్ ప్రణాళికలు రూపొందించుకుని అక్టోబర్ 27నుంచి యాత్ర చేస్తానని ప్రకటించారు. ఇందుకు ప్రణాళికను కూడా జగన్ సిద్ధం చేసుకున్నారు. రూట్ మ్యాప్ కూడా తయారైంది. జగన్ పాదయాత్రకు అనుగుణంగా వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రత్యేక కార్యక్రమాలను కూడా రూపొందించారు. గడపగడపకూ వైసీపీ, వైఎస్ కుంటుంబం, కార్కకర్తల ఇళ్లకు వైసీపీ స్టిక్కర్లు అంటించడం వంటివి కార్యక్రమాల్లో చేర్చారు. అయితే నియోజకవర్గాల్లో ఒకరికిద్దరు లీడర్లు ఉండటంతో కార్యక్రమాలను సజావుగా నిర్వహించడం లేదని జగన్ దృష్టికి వచ్చింది. ముందు గ్రౌండ్ వర్క్ సరిగా ప్రిపేర్ చేయకుండా పాదయాత్రకు వెళ్లడం సరికాదని జగన్ భావించారని కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు. అందుకే పాదయాత్రను వాయిదా వేసి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తానే ప్రతి నియోజకవర్గ ఇన్ ఛార్జితో మాట్లాడాలని జగన్ నిర్ణయించారు. అందుకోసమే పాదయాత్రను నవంబర్ 2కు వాయిదా వేశారని వైసీపీ వర్గీయుల నుండే ఒక వార్త తాజాగా లీక్ అయ్యింది.