ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. కావాలనే చేస్తోందో లేక యాధృచ్చికమో తెలీటం లేదు. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. బుధవారం గుంటూరులో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యేందుకు జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి కాన్వాయ్ తో జగన్ బయలుదేరిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఏసి లేదు. దానితో పాటు వాహనం లోపల కూడా శుభ్రంగా లేదు. దీనిపై పోలీసు అధికారులకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరులో వాహనాన్ని మార్చారు. అయితే తిరుగు ప్రయాణంలో ఆ వాహనం మంగళగిరి వద్ద ఏకంగా పంక్చర్ అయిపోయింది. దీంతో పోలీసులను నమ్ముకోవడం వదిలేసి ప్రైవేట్ వాహనంలో వివాహ వేడుకకు జగన్ వెళ్లారు.
జగన్ భద్రత విషయంలో పోలీసులు పదేపదే చూపుతున్న నిర్లక్ష్యం పట్ల వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కోసం ఏర్పాటు చేస్తున్న వాహనాలు పదేపదే పంక్చర్లు కావడం, మధ్యలో ఆగిపోవడం వంటివి జరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు జగన్ రాగా కృష్ణా, గుంటూరు జిల్లా పోలీసులు ప్రోటోకాల్ను అపహాస్యం చేశారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తున్నసమయంలోనూ జగన్ కారు రన్నింగ్లో పంక్చర్ అయింది. దీంతో వాహనం రోడ్డు పక్కకు లాగేసింది. విశాఖ పర్యటనకు వెళ్లిన సమయంలోనూ ఇలాగే సర్వీస్లో లేని వాహనాన్ని జగన్కు కేటాయించారు. విశాఖలోని ఒక హోటల్లో జగన్ బస చేయగా రాత్రి వేళలో సెక్యూరిటీగా ఒక పోలీసును మాత్రమే ఉంచారు. ఇలా ప్రతిపక్ష నేత భద్రత విషయంలో పోలీసులు పదేపదే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో తమకు అర్థం కావడం లేదంటున్నారు వైసీపీ నేతలు. అధికారం ఎప్పుడూ ఒకరి వద్దే ఉండదన్న విషయాన్ని అధికారులు గుర్తించుకోవాలని సర్వత్రా చర్చించుకుంటున్నారు.