నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతమంది వైసీపీ నేతలు టీడీపీలోకి వెళుతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రతిరోజు వైసీపీలో చేరికలు జరుగుతున్నప్పటికీ పార్టీని కొందరు నేతలు వీడనున్నట్లు లోటస్ పాండ్కు కూడా సమాచారం అందింది. దీంతో జగన్ శనివారం కర్నూలు జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో తమదే విజయమని నేతల్లో జగన్ భరోసా కల్పిస్తున్నారు. పార్టీని వీడి వెళితే మీకే నష్టమని పరోక్షంగా జగన్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఉన్న సర్వే నివేదికలను కూడా జగన్ నేతల ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దాదాపు గంట సేపు జరిగిన ఈ సమావేశంలో ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.
అయితే ఎన్నికల సమయంలో ఎవరు ఎటువైపు నిలుస్తారో చెప్పలేమన్న విషయాన్ని పాత సంగతులను కూడా జగన్ గుర్తు చేశారు. 1994లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు కేవలం 26 సీట్లు వచ్చాయని, అయితే ఆతర్వాత జరిగిన 1999లో 92 స్థానాలను దక్కించుకున్న విషయాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని మర్చిపోవద్దని జగన్ తెలిపారు. ఇలా అపజయాలను చూసి వెనుకంజ వేయకూడదని జగన్ వైసీపీ నేతలకు హితబోధ చేశారు. అంతెందుకు ఉపఎన్నికల్లో వైసీపీ విజయఢంకా మోగించి సాధారణ ఎన్నికల్లో వెనక్కు పోవడానికి కారణాలను అన్వేషించామని, అందుకు దిద్దుబాటు చర్యలు కూడా తీసుకుంటున్నామని జగన్ నేతలకు వివరించినట్లు తెలిసింది. ప్రస్తుతం చేస్తున్న సర్వేలన్నీ తమకే అనుకూలంగా వస్తున్నాయని జగన్ చెప్పారు. తర్వాత సమావేశంనుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు సయితం తాము పార్టీని వీడటం లేదని టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని వైసీపీ నేతలు జగన్కు వివరించారు. కాగా జిల్లాలో రైతు భరోసా యాత్ర చేయాలని వారు జగన్ ను కోరారు. కాగా నెల పదిన అనంతపురంలో జరగనున్న యువభేరీకి జగన్ హాజరవుతున్నారు.