ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు దేశంలో.. అత్యంత సీనియర్ నాయకుడుని నేనే అని చెప్పుకుంటారు. అయితే కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న చంద్రబాబుకు ముగ్గురు నేతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆ ముగ్గురు నేతల్లో.. ఒకరు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్, మరొకరు మాజీ మంత్రి, కాకినాడ మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం, ఇంకొకరు అమలాపురం మాజీ ఎంపీ జివి హర్ష కుమార్. వారిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఆ ముగ్గురు నేతలు మాజీ ఎంపీలు కావడం ఒకటైతే.. ఆ ముగ్గురు మొనగాళ్లు తూర్పు గోదావరి జిల్లా వారే కావడం మరో విశేషం. ఉండవల్లి అరుణ కుమార్ ఏ పార్టీలో లేకపోయినా క్రమం తప్పకుండా ప్రభుత్వ లోపాలపై సహేతుక సాక్ష్యాధారాలతో ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూనే వుంటారు . మరొక నేత కాపు ఉద్యమ కారుడు ముద్రగడ పద్మనాభం తనదైన శైలిలో బాబును ఇచ్చిన మాట నెరవేర్చుకో అంటూ కొత్త కొత్త ఉద్యమాలు చేస్తూ పంటికింద రాయిలా టీడీపీ సర్కార్ను సలుపుతూనే వుంటారు. ఇక అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ తరహా మరో రకంగా ఉంటుంది . రాష్ట్రంలో ఎక్కడ దళితుల సమస్య వున్నా అక్కడికి వెళ్లి ఆ ఉద్యమానికి సారధ్యం వహిస్తారు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో రీతిలో సర్కార్కు సమస్య గా మారారు.
వీరి ముగ్గురిలో ఇద్దరిని జనం మధ్య తిరగకుండా నిరవధిక నిర్బంధాలతో ప్రభుత్వం కట్టడి చేస్తూ వస్తుంది. వేలమంది పోలీసులను మోహరించి వారి ఉద్యమాలు వ్యూహాలు సాగకుండా చేస్తుంది . హర్ష కుమార్ను అయితే 22 సార్లు ఇప్పటివరకు గృహనిర్బంధంలో పెట్టారు పోలీసులు. ముద్రగడ పద్మనాభం పరిస్థితి అంతే . ఇక ఉండవల్లి అరుణ కుమార్ విషయంలోనే ప్రభుత్వం ఏమిచేయలేని పరిస్థితిని ఎదుర్కొంటుంది . ఆయన కేవలం మీడియాతో మాట్లాడి విమర్శలు ఆరోపణలు చేసి వెళుతూ ఉండటంతో కనీసం జవాబు కూడా ఇవ్వలేక సర్కార్ మౌన జపం చేస్తుంది. చంద్రబాబు అంటే అరుణ కుమార్ , హర్ష కుమార్ లు దశాబ్దాలుగా కాంగ్రెస్లో ఉన్నప్పటి నుండే వ్యతిరేకిస్తూనే వున్నారు. కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు వారిద్దరి గ్రూప్లు వేరు వేరు అయినా బాబు వ్యతిరేక విధానంలో ఇద్దరిదీ ఒకటే పాలసీ . ముద్రగడ కమ్యూనిస్ట్ పార్టీలో తప్ప అన్ని పార్టీలు మారిన వ్యక్తి . టీడీపీలో మంత్రిగా ఎంపీగా వెలుగు వెలిగిన వారు . అయితే ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో సన్నిహితంగా వుండే వారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఆయనకు తన రాజకీయ అవసరాల రీత్యా దగ్గర చేసుకుని బీజేపీ దెబ్బకొట్టేందుకు కాకినాడ ఎంపీ టికెట్ ఇచ్చారు . అయినా బాబు ముద్రగడ నడుమ ఎప్పటినుంచో కోల్డ్ వార్ ఉండనే వుంది. చంద్రబాబును ముప్పుతిప్పలు పెడుతున్న ఈ త్రిమూర్తులు ముగ్గురివి వేరు వేరు సామాజిక వర్గాలు కావడం మరో విశేషం. ఎన్నిరకాల వ్యూహాలు సర్కార్ అమలు చేస్తున్నా ఈ ముగ్గురు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ సర్కారుని ఆడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.