ప్రస్తుతం దేశంలో టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న జియోకు పోటీగా తక్కువ ధరకే ఎయిర్టెల్ ఓ స్మార్ట్ఫోన్ తీసుకొస్తోంది. కార్బన్ మొబైల్స్తో జట్టుకట్టి రూ.1399కే స్మార్ట్ఫోన్ను అందించనుంది. ‘మేరా పెహ్లా 4జీ స్మార్ట్ఫోన్’ పేరిట ఈ మొబైల్ను ప్రకటించింది.రూ.1500కే 4జీ ఫోన్ను జియో తీసుకొచ్చిన నేపథ్యంలో దానికి పోటీగా ఎయిర్టెల్ కూడా స్మార్ట్ఫోన్ తీసుకొస్తానని గతంలో ప్రకటించింది.
ఇందుకోసం పలు కంపెనీలతో చర్చలు జరిపింది. చివరికి కార్బన్ మొబైల్స్తో జట్టుకట్టి కార్బన్ ఏ40 మొబైల్ను ఈ పథకం కింద అందిస్తుంది.
దీని మార్కెట్ ధర రూ.3,499 కాగా.. ఎయిర్టెల్ దీన్ని రూ.2899కే వినియోగదారులకు విక్రయించనుంది. ఇందులో రూ.1500 మొత్తాన్ని మూడేళ్ల తర్వాత వాపసు ఇస్తారు. అంటే ఫోన్ ధర రూ.1399కే వినియోగదారులకు దక్కనుంది.
క్యాష్బ్యాక్ పొందేందుకు వినియోగదారులు తొలి 18 నెలల్లో కనీసం రూ.3వేలు రీఛార్జి చేయాల్సి ఉంటుంది. అప్పుడు తొలి విడతగా రూ.500 క్యాష్ బ్యాక్ అందిస్తారు. ఆ తర్వాతి 18 నెలలకూ అంతేమొత్తంలో రీఛార్జి చేయడం ద్వారా మిగిలిన రూ.1000ని పొందుతారు. మూడేళ్ల తర్వాత ఫోన్ వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని ఎయిర్టెల్ పేర్కొంది.