కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బైక్ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు వంతెనపైనుంచి పడి మృతి చెందారు. ఈ ఘటన బొమ్మనహళ్లి సమీపంలోని గారేబావి పాళ్య వద్ద శనివారం చోటు చేసుకుంది.
మడివాళ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు… మహ్మద్ హుసేన్(36), ఫకృద్ధీన్(34) అనే వ్యక్తులు శనివారం మడివాళ వైపు నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వైపు బైక్లో వెళ్తుండగా భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ ఇద్దరూ ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో గారేబావి సమీపంలో వంతెనపై మడివాళ వైపు నుంచి వస్తున్న కాల్ సెంటర్కు చెందిన ఓ కారు ఢీకొంది. దీంతో బైక్ వంతెన సైడ్వాల్ను ఢీకొని ఇద్దరూ వంతెనపైనుంచి కిందకు పడిపోయారు. ప్రమాదంలో మహ్మద్ హుసేన్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఫకృద్ధీన్ను సమీపంలోని సంజాన్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రమాద దృశ్యం సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి.