మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నవంబర్ 2 నుంచి తలపెట్టనున్న పాదయాత్రను అడ్డుకోవడానికి కుట్ర జరుగుతుందా..పాదయాత్ర చేస్తే వచ్చే ఎన్పికల్లో తమకు ఓటమి తప్పదని టీడీపీకి భయపడుతుందా..అందుకే జగన్ పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదంటూ సిబిఐ తమ ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేయడం వెనుక టీడీపీ పెద్దలు ఉన్నారా..ప్రస్తుతం ఏపీలో టీడీపీ నాయకులు చేస్తున్నరగడ చూస్తుటే జగన్ పాదయాత్రను అడ్డుకోవడానికి పెద్ద కుట్రే జరుగుతుందనిపిస్తుంది..జగన్ పాదయాత్రను అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందంటూ ప్రముఖ జర్నలిస్ట్ ఇలపావలూరి మురళీధర్ రావు రాసిన కథనం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ఆయన రాసిన ఆ కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.. వెబ్ పాఠకుల కోసం కర్టెసీగా ఇలపావులూరి గారి కథనాన్ని యధావిధిగా మీకు అందిస్తున్నాము..
నాకు తెలిసినంతవరకూ వైసిపి అధినేత జగన్ ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. విదేశాలకు వెళ్లడం మినహా దేశం, రాష్ట్రాలలో తిరగడానికి అతనిమీద ఆంక్షలు ఏమీ లేవు. దేశంలో ఎక్కడైనా తిరగడానికి ఎవరి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కోర్టు కూడా జగన్ పర్యటనలమీద నియంత్రణను తన బెయిల్ ఆదేశాలలో ఇచ్చినట్లు పేర్కొన్నట్లు లేదు.
జగన్ పాదయాత్రను చెయ్యదలచుకుంటే అందుకు పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలి. అనగా ప్రభుత్వ అనుమతి అవసరం. ఒకవేళ శాంతిభద్రతల సాకు చూపించి పాదయాత్రకు ప్రభుత్వం అనుమతిని నిరాకరిస్తే అప్పుడు అతను కోర్టుకు వెళ్లి అనుమతి కోరవచ్చు. ప్రభుత్వాలు నిరాకరించినా కోర్టులు అనుమతి ఇచ్చిన సందర్భాలు గతంలో ఉన్నాయి.
జగన్ పాదయాత్రను అడ్డుకోవాలని సిబిఐ కోర్టుకు విన్నవించింది అని విన్నాను. పాదయాత్ర అనేది రాజకీయ సంబంధిత నిర్ణయం. దానికి సిబిఐ కి సంబంధం ఏమిటి? పాదయాత్రను అడ్డుకోవాలని కోర్టును సిబిఐ ఏ అధికారంతో కోరుతుంది? శుక్రవారం కోర్టులో హాజరు కావడం మినహా మిగిలిన రోజుల్లో జగన్ మీద, జగన్ కార్యకలాపాలమీద ఎలాంటి ఆంక్షలు లేవు. చూడబోతుంటే సిబిఐ వెనుక కొన్ని రాజకీయ శక్తులు అదృశ్యంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నది. న్యాయస్థానాలు సిబిఐ కుట్రలకు ప్రభావితం కావు అని ఆశిస్తున్నాను.
ఇదిలా ఉండగా జగన్ పాదయాత్ర మీద అధికారపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, వారి ఉలికిపాటు చూస్తుంటే వారికి అసలు రాజకీయపరిణీతి ఏమాత్రం లేనట్లు తోస్తున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ కార్యకలాపాలను నియంత్రించాలనుకోవడం, అనుచిత విమర్శలను చెయ్యడం చూస్తుంటే రాష్ట్రప్రభుత్వానికి తాను సాధించిన అభివృద్ధి మీద ఏమాత్రం నమ్మకం లేనట్లు కనిపిస్తున్నది. తమ వైఫల్యాలను ప్రజలలో జగన్ ఎండగడతాడేమో అన్న భీతి వారిని వెంటాడుతున్నది అనుకోవాల్సి వస్తుంది.
– ఇలపావులూరి మురళీ మోహన రావు