వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ రోహిణి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ఓ ఆపరేషన్ ధియేటర్ లో ఆక్సిజన్ సిలిండర్ పేలి.. షార్ట్ సర్క్యూట్ అయ్యి.. మంటలు చెలరేగాయి. అక్టోబర్ 16వ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో.. రెండో అంతస్తులో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది.
వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది.. ఆస్పత్రిలోని 198 మంది ఇన్ పేషంట్లను బయటకు తీసుకొచ్చారు.
ICU నుంచి కూడా పేషంట్లను బయటకు తీసుకొచ్చి.. ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్ పేలుడుతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. బెడ్స్ తోపాటు పేషంట్లు అందరూ ఆస్పత్రి ఆవరణలోకి తీసుకొచ్చారు. అంబులెన్సుల్లో తరలిస్తున్నారు. ఆరు బయటే అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం సమయంలో కుమారస్వామి అనే పేషెంట్ కి ఆపరేషన్ జరుగుతుంది.
అతన్ని బయటకు తీసుకురావటంలో ఆస్పత్రి సిబ్బంది విఫలం అయ్యారు. ఫైర్ సిబ్బంది అతన్ని బయటకు తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.సరైన సమయంలో స్పందించటంతో రోగులందర్నీ సకాలంలో సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు చెబుతోంది ఆస్పత్రి యాజమాన్యం. ఫైర్ యాక్సిడెంట్ తర్వాత వ్యాపించిన పొగను పీల్చిన కొంత మంది సిబ్బంది అనారోగ్యానికి గురయ్యారు. వీరిని ఆరుబయటే ఉంచి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఈ ఆస్పత్రి స్థాపించి 27 ఏళ్లు అవుతుంది.