కాంగ్రెస్ నేతల ద్వంద్వ విధానాలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. శాసనమండలిలో గురువారం మంత్రి మాట్లాడుతూ గ్రెస్ నాయకులు రైతులు, నీళ్లు, సెంటిమెంట్ లతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ..ఇలాంటి పనులు చేయవద్దని…ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని కోరారు. “మాకు అన్ని ప్రాంతాలు సమానమే. ఏ ఒక్క ప్రాంతానికి నష్టం చేయం. కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం లేదు. ఆ పార్టీ నాయకులు జిల్లాకో రకంగా, రాష్ర్టానికో రకంగా మాట్లాడుతున్నారు. జగిత్యాలలో నీళ్లు కావాలని జీవన్ రెడ్డి,తదితర నాయకులు అడుగుతున్నారు. నిజామాబాద్ కు కావాలని అక్కడి నాయకులు కోరుతున్నారు. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా నేతలు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు నీళ్లు ఇవ్వొద్దంటున్నారు. ఇదెక్కడి న్యాయం?“ మంత్రి హరీశ్రావు సూటిగా ప్రశ్నించారు.
“ఉమ్మడి మెదక్ జిల్లా వాసులకు తాగడానికి నీళ్లివ్వకుండా హైదరాబాద్ కు తరలించిన పాపం కాంగ్రెస్ దే. కానీ ఇప్పుడు వారే మొసలికన్నీరు కారుస్తున్నారు. ఘనపురం ఆయకట్టు కింద యాసంగి పంటకు ఖచ్చితంగా నీళ్లిస్తాం. నిజాంసాగర్, ఎస్.ఆర్.ఎస్.పి.పరిధిలోని రైతులకు ఇబ్బందులున్నందున సింగూరు నుంచి నీటిని వదులుతున్నాం. సింగూరులో 16 టీఎంసీల నీటిని నిల్వ ఉంచిన తరువాతనే శ్రీరాంసాగర్ కు ఇస్తున్నాం.శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం అతి తక్కువ ఖర్చు, అతి తక్కువ సమయంలో పూర్తి చేస్తున్నాం. దీని కోసం కోట్లు ఖర్చు చేస్తున్నాం. 12మీటర్ల దగ్గర లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నాం. మూడు లిఫ్టులు ఉన్నా రెండు మాత్రమే వినియోగిస్తున్నాం. ప్యాకేజ్ 20, 21, 22కింద నిజామాబాద్, నిర్మల్,కామారెడ్డి జిల్లాల్లో సాగునీటికి, మిషన్ భగీరథ కు కలిపి మొత్తం12లక్షల 47వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వవలసి ఉంది. అయితే ప్రస్తుతం ఎస్.ఆర్.ఎస్.పి కెపాసిటీ 90 టి.ఎం.సీలే కావడం వల్ల అంత భూమి పారడం కష్టం. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ కింద ఒక్క ఇల్లు మునుగకుండా, భూసేకరణ లేకుండా ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నాము“ అని మంత్రి హరీశ్ రావు వివరించారు.
ఎస్సారెస్పీకి కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లింక్ చేస్తే అన్ని పంటలకు నీళ్లు ఇవ్వొచ్చునని మంత్రి హరీశ్ రావు వివరించారు. “ వచ్చే ఏడాది కాళేశ్వరంను ఎస్సారెస్పీ కి కనెక్ట్ చేస్తాం. ఈ ఏడాది ఎస్సారెస్పీ లో 50 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. అందరికి నీళ్లు ఇవ్వడానికి సింగూరు నుంచి నిజం సాగర్ కి అక్కడ నుంచి ఎసరెస్పీ కి పంపుతున్నాము. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు మా ప్రాంతాలకే నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 16టీఎంసీలు మెదక్కు, మిగతా నీళ్లు నిజామాబాద్ జిల్లాకు ఇచ్చి అన్ని జిల్లాకు అందరి ప్రజలకు న్యాయం చేస్తున్నాము. వచ్చే జూన్, జులై వరకు ఎసరెస్పీ వరకు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం.దీంతో ఎస్.ఆర్.ఎస్పీ పరిధిలో 12.47 లక్షల ఎకరాలకు నీరందింస్తాం. కాంగ్రెస్ నేతలు వాస్తవాలు గమనించి సహకరించాలే తప్ప విమర్శలు చేయవద్దు“ అని మంత్రి హరీశ్రావు సూచించారు.