తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .అయితే త్వరలో జరగనున్న కొడంగల్ నియోజక వర్గ ఉప ఎన్నికకు అధికార పార్టీ టీఆర్ఎస్ ఇంచార్జ్ గా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే సి ఆర్ గురువారం నాడు నియమించారు. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హరీష్ రావుకే ఈ ఉపఎన్నిక బాధ్యతను అప్పగించారు. కొడంగల్ ఉపఎన్నికల్లో పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని మంత్రి హరీష్ రావు నిర్ణయించారు.
ఈ ఉప ఎన్నికను హరీశ్రావు సవాలుగా తీసుకున్నారు. కొడంగల్ ఉపఎన్నిక కు సంబంధించి గడచిన నాలుగైదు రోజులుగా ఆయన కసరత్తు చేస్తున్నారు.అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే కొడంగల్ కు బయలుదేరి వెళ్ళాలని మంత్రి హరీశ్ రావు నిర్ణయించుకున్నారు.ఆ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని,వాటిని ప్రభుత్వపరంగా పరిష్కరించే చర్యలను సమీక్షించాలని ఆయన అనుకుంటున్నారు. దాదాపు నెలరోజులపాటు అక్కడే మకాం వేయాలని కూడా హరీశ్ రావు నిర్ణయించినట్టు తెలిసింది.ఒకే దెబ్బకు రెండు పిట్టల్నికొట్టడానికి కొడంగల్ ఫలితాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి వ్యూహరచన చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి ని ఓడించడం ద్వారా కాంగ్రెస్స్ ను చావు దెబ్బకొట్టాలని, అలాగే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేసినా తమకు ఎదురు లేదని రుజువు చేయాలని హరీశ్ రావు భావిస్తున్నారు. కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి రాజీనామా అసెంబ్లీ స్పీకర్ కు అందిన వెంటనే ఉపఎన్నిక అనివార్యం కావచ్చుననే ఉద్దేశంతో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు హరీశ్ రావును ముఖ్యమంత్రి రెడీ చేశారు.
ఈ మేరకు వెంటనే రంగంలోకి దిగిన మంత్రి హరీశ్ రావు మంత్రులు జూపల్లి కృష్ణారావు,మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రణాలికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, పార్టీ ఎం.ఎల్.ఎ.లు, నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున టిడిపి,కాంగ్రెస్ నాయకులు,మండల, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులను టిఆరెస్ లోకి రప్పించే కార్యక్రమాలు జరుతున్నాయి. హరీష్ రావు ఎక్కడ అడుగుపెట్టినా విజయం తధ్యమని ఆయనది’ గోల్డెన్ లెగ్’ అని పలు సందర్భాలలో ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసిఆర్ బహిరంగంగా ప్రశంసలు గుప్పించారు. చూడాలి మరి కోడంగల్ ఉప ఎన్నికల్లో గెలుపు ఖాయమైన కానీ మెజారిటీ ఎంత వస్తుందో ..?