Bankers review meeting with Minister @PocharamTRS garu & Mission Bhagiratha vice chairman Vemula Prashanth Reddy garu, NZB MLAs & concerned officials at #Pragathibhawan, Nizamabad pic.twitter.com/EWa1SaUiQz
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 11, 2017
అన్నదాతలకు కలుగుతున్న ఆర్థిక కష్టాలపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించే రైతన్నల విషయంలో బ్యాంకర్ల తీరును ఎంపీ కవిత ఆక్షేపించారు. “రైతులంటే అంత చులకనా…రైతులే కదా….వారికేం తెలుసుని అనుకుంటున్నారా….అడిగిన వాళ్లను కసురుకుంటున్నారు..ఇదేం పద్దతి“…అంటూ బ్యాంకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్ కలెక్టరేట్ ప్రగతి భవన్లో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కవిత మాట్లాడుతూ రైతుల కష్టాలపై గళం విప్పారు.
ఈ సమావేశంలో బోధన్ మండలం సాలూరా ఎస్బీహెచ్ మేనేజర్ వ్యవహార శైలిని ఎంపీ కవిత ప్రస్తావించారు. గతంలో హున్సా, మందర్న, ఖాజాపూర్ గ్రామాలకు చెందిన చెరకు రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసినా…బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వారికి సకాలంలో రుణమాఫీ జరగలేదన్నారు. ఈ విషయాన్ని బాధిత రైతులు తన దృష్టికి తీసుకు వచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల సంక్షేమం కోసం రూ.27 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నదని కవిత తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయకుండా బ్యాంకు అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అర్హులను ప్రభుత్వం ఎంపిక చేస్తుందని, ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్దిదారులను మీరు మళ్లీ సెలెక్ట్ ఎందుకు చేస్తున్నారని ఎంపీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్ప్ డెస్క్లు అక్కరకు రావడం లేదు, సిబ్బంది ఫోన్లు ఎత్తరు…లబ్దిదారులు ఏమయిపోవాలె…మీ తీరు మారదా…అని ప్రశ్నించారు. మూడున్నరేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు రుణాలు మంజూరు చేసే ఖరీఫ్, రబీ సీజన్లలో బ్యాంకులు హెల్ప్ డెస్క్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని, బ్యాంకుకు వచ్చిన వారిని మర్యాదగా పలకరించి , వారి గౌరవానికి భంగం కలగకుండా చూడాలని ఎంపీ కవిత బ్యాంకర్లకు సూచించారు. ప్రతి బ్యాంకులో హెల్ప్ డెస్క్ల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసి, కంట్రోల్ రూంకు అనుసంధానించి మానిటర్ చేయాలని లీడ్ బ్యాంకు ఎస్.బి.ఐ ఉన్నతాధికారులకు కవిత సూచన చేశారు. సమావేశంలో మంత్రి పోచారం కూడా తన అనుభవాలను వివరించడంతో సమావేశంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పొతంగల్, ఎత్తొండ లలోని ఎస్బిహెచ్ బ్యాంకుల మేనేజర్ల వ్యవహార శైలిని మంత్రి సమావేశంలో వివరించారు. మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ దఫేదార్ రాజు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ వీజీగౌడ్లు సైతం బ్యాంకర్లపై ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారుల వ్యవహర శైలిని తప్పు పట్టారు. రైతులకు రుణమాఫీ, రుణాల పంపిణీ, సబ్సిడీలను అందించడంలో బ్యాంకులు అలసత్వం వహిస్తున్నాయని, రైతుల శ్రమపడటం వల్లే తినడానికి అన్నం దొరుకుతుందన్న విషయాన్ని మరువవద్దని చురకలు వేశారు. ఇంఛార్జి కలెక్టర్ రవీందర్ రెడ్డి సైతం బ్యాంకు మేనేజర్లు తమ పనితీరును మార్చుకోవాలని హితవుపలికారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని సమావేశం బ్యాంకర్లకు సూచించింది. సమావేశానికి నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యే లు గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, మేయర్ సుజాత, రెడ్ కో ఛైర్మన్ అలీం, డిసిసిబి చైర్మన్ గంగాధర్ పట్వారి హాజరయ్యారు.