ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై ఎన్నడూ లేనంతగా విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. పూర్తి వివక్షాపూరితంగా నంది అవార్డులను ప్రకటించారని పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఊరుకుంటారా?.. గతంలోనే నంది అవార్డులను ‘గుర్రం’ అవార్డులంటూ తాను సునీల్ హీరోగా తీసిన ‘కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు’ అనే సినిమాలో వర్మ హేళన చేశారు. అవి ఎందుకు ఇస్తారో ఎవరికీ ఇస్తారో ఏ టాలెంట్ చూసి ఇస్తున్నారో అంటూ ఇప్పటికీ వర్మ మండిపడుతున్నారు. తరువాత మళ్లి ఇప్పుడు నంది అవార్డులు ఇప్పుడు టాలీవుడ్లో హాట్టాపిక్ గా మారింది. అవార్డుల ఎంపికలు సరిగ్గా లేవంటూ టాలీవుడ్లో నిరసన గళం వినిపిస్తోంది. వీటిపై రామ్గోపాల్ వర్మ నంది అవార్డు కమిటీకి ఆస్కార్ ఇవ్వాలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించగా, అవి నంది అవార్డులు కాదు సైకిల్ అవార్డులు అంటూ బండ్ల గణేష్ ఎద్దేవా చేశారు. బన్నీవాసులతో పాటు పలువురు ప్రముఖులు సైతం విమర్శల గళం ఎక్కుపెట్టారు.
తాజాగా జీవితా రాజశేఖర్ నంది అవార్డులపై ఘాటుగా స్పందించారు. 2015లో ఆమె నంది అవార్డుల కమిటీకి జ్యూరీ సభ్యురాలిగా ఉన్నారు. అవార్డుల జాబితాను మూడు నెలల పాటు కసరత్తు చేసి విజేతలను ఎంపిక చేస్తారని అన్నారు. జ్యూరీ సభ్యుల శ్రమని పాజిటివ్గా తీసుకోకుండా పరిశ్రమ పరువుని తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అవార్డుల ఎంపికలో పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటారన్నారు.
జ్యూరీ ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలియని వారికి మాట్లాడే అర్హత లేదంటూ జీవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎంపిక ప్రక్రియ గురించి మెగా ఫ్యామిలీలో ఏ ఒక్కరూ స్పందించలేదని, వారికి లేని బాధ, బయటి వారికి ఎందుకంటూ జీవిత ప్రశ్నించారు.