టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీల తన వ్యాపార భాగస్వామిపై క్రిమినల్ కేసు పెట్టారు. నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు వ్యాపారంలో తనను మోసం చేశాడని, తనకు తెలీకుండా ఆస్తులు అమ్మేశాడని నాగసుశీల నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేయవలసిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది.
ఇక గత కొన్ని సంవత్సరాలుగా చింతలపూడి శ్రీనివాసరావు భాగస్వామ్యంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించామని, అయితే తనకు తెలీకుండా భూములను అతను అమ్ముకుని మోసం చేశాడని సుశీల ఫిర్యాదు చేసింది. శ్రీనాగ్ ఎస్టేట్స్, శ్రీనాగ్ కార్పొరేషన్, ఎస్ ఆర్ ప్రాపర్టీస్ సంస్థలలో మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నాడు చింతలపూడి శ్రీనివాస రావు. వీరిద్దరూ కలిసి పలు సినిమాలు కూడా నిర్మించారు.
సుశాంత్ను హీరోగా పెట్టి నాగసుశీల, శ్రీనివాసరావు కలసి శ్రీనాగ్ కార్పోరేషన్ బ్యానర్పై మూడు సినిమాలు నిర్మించారు. వాటిలో కరెంట్ సినిమా ఫర్వాలేదనిపించినా.. ఆ తరవాత వచ్చిన అడ్డా ఫ్లాపయ్యింది. ఇక మూడో ప్రయత్నంగా నిర్మించిన ఆటాడుకుందాం రా ఎప్పుడొచ్చిందో వెళ్లిందో కూడా తెలియలేదు. అప్పటికే భూమి విషయంలో వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు ఈ సినిమా పరాజయంతో మరింత ఎక్కువైనట్లు సమాచారం. ఈ సినిమా కోసం శ్రీనివాసరావు రూ.5 కోట్లు సమకూర్చినట్లు తెలుస్తోంది.
అయితే సినిమా పరాజయంతో నష్టం రావడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే తనపై తప్పుడు కేసులు పెట్టారని శ్రీనివాసరావు ఆరోపిస్తున్నట్లు సమాచారం. 2004-05 మధ్య కాలంలో జరిగిన కొన్ని భూ విక్రయాల విషయంలో ఇప్పటికే వీరిద్దరి మధ్య ఓ సివిల్ కేసు నడుస్తున్నట్లు సమాచారం. ఆ సివిల్ కేసు ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉంది. అయితే ఇప్పుడు మరోసారి శ్రీనివాసరావుపై నాగసుశీల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.