ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించే ఆయన.. ఈసారి నంది అవార్డులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో ఆధార్ కార్డు లేని వారికి నంది అవార్డుల పై విమర్శలు చేసే అర్హత లేదంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల పై పోసాని విరుచుకుపడ్డారు.
ఒక ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి అయి ఉండి నాన్ లోకల్ అంటూ వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డు తనకు రావడం సిగ్గుగా ఉందని పోసాని ఆవేదన చెందారు. ఆధార్ కార్డులుంటే మర్డర్లు చేసినా పర్వాలేదా అని నిలదీశారు. అమరావతి చుట్టూ ఉన్న భూములు ఎవరివి అని నిలదీశారు. తప్పులు ఎత్తిచూపితే నంది అవార్డులని రద్దు చేస్తారా.. నంది అవార్డులన్నీ ముందే లీక్ అయినందున వాటన్నింటిని రద్దు చేసి మరలా ఎంపిక జరపాలని పోసాని డిమాండ్ చేశారు.
ఇక సగటు మనిషి, అమ్మాయి కాపురం, అరుణకిరణం, అన్న, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, స్నేహితులు.. వంటి మహిళా సాధికారత ఉన్న గొప్ప సినిమాలు సుబ్బయ్యగారు తీస్తే.. ఇలాంటి రెండు గొప్ప సినిమాలైనా బి.ఎన్.రెడ్డి అవార్డు వచ్చినవాళ్లు తీశారా.. సుబ్బయ్య ఆ అవార్డుకి పనికిరాడంటే నేను అజ్ఞానిని… పిచ్చికుక్కలాగా ఏదో వాగేశా… క్షమించండి అంటా.. అయితే ఈ డౌట్లు నావి మాత్రమే కాదని.. జనాలకి ఇవే డౌట్లు వచ్చాయని.. వాటికి మీరే సమాధానం చెప్పాలని పోసాని ఫైర్ అయ్యారు.
లోకేష్నే కాకుండా చంద్రబాబును కూడా వదల్లేదు పోసాని. చంద్రబాబుగారి స్టేట్మెంట్లు చూస్తే తెలుస్తోంది.. ఈ నంది అవార్డులు మేం నిజాయితీగా ఇచ్చాం అని ఎక్కడా అనడం లేదు. ఇవి అలా చేసుంటే బాగుండేది.. ఐఆర్వీసీ పద్ధతుల్లో ఇచ్చుంటే బాగుండేదేమో.. అని అన్నారు. అంటే అర్థమేంటి.. లోపల ఏదో మతలబు జరిగిందనేగా.. చంద్రబాబు ఇంకోమాట ఏమన్నారంటే.. నంది అవార్డుల్లో ఏముంది. జ్యూరీ సభ్యులు బాగా చూసుకుంటారని పెట్టాం. వాళ్లు ఇచ్చిందాన్ని మేం ఏం చేయగలమని అన్నారు. అంటే లోపం జరిగిందనేగా.. అంటే చంద్రబాబు తప్పు ఒప్పుకున్నట్టేగా.. అని పోసాని చంద్రబాబును కూడా అడ్డంగా ఎండగట్టారు.