చంద్రబాబు హయాం.. మాకేంటి భయం అంటూ సామాన్యులను దోచుకుంటున్నారు టీడీపీ వర్గీయులు. వివిధ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తేలా నిర్ణయాలు తీసుకుని, వాటి పరిష్కారం కోసం తమ వద్దకే వచ్చేలా చేయడం చంద్రబాబు సర్కార్కు వెన్నతో పెట్టిన విద్య అని అందరికి తెలిసిన విషయమే. కాపులను బీసీల్లో చేర్చుతామంటూ ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలే పై వ్యాఖ్యలకు నిదర్శనం. కాపులను బీసీల్లో చేర్చుతామని చెప్పిన చంద్రబాబు.. అధికారం చేపట్టాక ఆ విషయంపై కమిషన్ వేశాం. కమిషన్ నివేదిక రాగానే తుది నిర్ణయం తీసుకుంటామంటూ కాలం వెల్లదీస్తున్నారు. చంద్రబాబు ఊసరవెళ్లి రాజకీయాల్లో మరొకటిగా.. కాపుల అంశం చేరిందని అనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు.
అయితే, నాటి.. నేటి చంద్రబాబు పాలనలో అరాచకాలు అనేకం అన్న విషయం విధితమే. ఇందుకు నిదర్శనంగా చాలానే సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. జిల్లాకో టీడీపీ ముఠా తమకు అందినంత దోచుకుంటున్నారు. అడ్డొచ్చిన సామాన్యులపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఏమీ చేయలేని దయనీయ స్థితిలో ఉన్నారు సామాన్యులు. తాజాగా అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ అరాచకాలు, శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మరో వైపు ఇటీవల చంద్రబాబు సర్కార్ ప్రకటించిన నంది అవార్డులు కూడా చంద్రబాబు అరాచకపాలనకు నిదర్శనంగా నిలిచాయి.
అయితే, తాజాగా టీడీపీ నేతల కన్ను మత్స్యకారులపై పడింది. వారి సంపదను కొల్లగొట్టేందుకు ప్రైవేటు సంస్థలతో కలిసి పూటగడవని మత్స్యకారులపై విరుచుకుపడుతున్నారు. విశాఖపట్నం ఇందుకు కేంద్రంగా మారడం మరో విశేషం. విశాఖ ఫిషింగ్ హార్బర్లో చిన్న చేపలను మెకనైజ్డ్ రాబందులు మింగేస్తున్నాయి. సముద్రపు సరిహద్దులను చెరిపేస్తూ.. నిబంధనలకు పాతరేస్తూ.. మత్స్యకారుల బతుకుల్ని బుగ్గిపాలు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఓ వైపు ప్రకృతి, మరో వైపు టీడీపీ నేతల అండతో చెలరేగుతున్న పెద్ద బోట్ల మాఫియా చర్యలతో మత్స్యకారులు చిద్రమవుతున్నారు. దశాబ్దాలుగా తమకు మాత్రమే సొంతమైన వేటప్రాంతంలోకి చొచ్చుకు వచ్చి అక్రమంగా వేట సాగిస్తున్న మెకనైజ్డ్ బోట్ల ఆకృత్యాలతో ఆర్థికంగా చితికిపోతున్నామని తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.
కాగా, సాంప్రదాయం ప్రకారం సముద్రపు ఒడ్డు ప్రారంభం నుంచే మొదటి 25 కిలో మీటర్ల లోపు చిన్న వలలతో వందలాది కుటుంబాలు హక్కుగా వేట సాగిస్తున్నాయి. ఈ ప్రాంతంలోకి పెద్దబోట్లు వచ్చి వేటాడటం చట్టప్రకారం నిషేధం. అయినా నిబంధనలకు పాతరేస్తూ.. అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు మాఫియాగా ఏర్పడి మత్స్యకార సంప్రదాయానికి తూట్లు పొడుతుస్తున్నారు.
ఇకనైనా పెద్దబోట్ల యజమానులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే తామే పోరాటానికి సిద్ధం అవుతామని సంప్రదాయ మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు.