గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్పై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం ద్వారా వారి అజ్ఞానాన్ని వారే బయటపెట్టుకుంటున్నారని ఎంపీ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. జీఈఎస్ 2017 తెలంగాణ, హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచిందని..అయితే కాంగ్రెస్ నేతలు ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుపై అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని ఎంపీ సుమన్ అన్నారు.మంత్రి కేటీఆర్ ప్రతిభా పాటవాలకు అంతర్జాతీయంగా పెరిగిన ఆదరణను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు ఆయనపై విమర్శలకు దిగుతున్నారని ఎంపీ సుమన్ స్పష్టం చేశారు.మంత్రి కేటీఆర్ ఈవెంట్ మేనేజర్ గా మారారని కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని…మంత్రి కేటీఆర్ తెలంగాణకు పెట్టుబడులు తేవడంలో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లా వ్యవహరిస్తున్నారనే విషయం కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలన్నారు. కైలాస్ సత్యార్థి లాంటి నోబెల్ బహుమతి గ్రహీత మంత్రి కేటీఆర్కు కితాబునిచ్చిన సంగతి కాంగ్రెస్ నేతలైన షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్కకు తెలియదా? అని ప్రశ్నించారు. సత్యార్థి ప్రశంసించిన వీడియోను కాంగ్రెస్ నేతలకు పంపుతానని ఎంపీ సుమన్ వెల్లడించారు. కేటీఆర్ లాంటి మంత్రి ప్రతి రాష్ట్రంలో ఉండాలని కేంద్ర ఉన్నతాధికారులే వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.
తెలంగాణ పెట్టుబడులు ఆకర్షించడం కాంగ్రెస్ కు ఇష్టం లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ ప్రతిభకు తెలంగాణా పారిశ్రామిక రంగం సాధిస్తున్న ప్రగతి గణాంకాలే నిదర్శనమన్నారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ నగరం త్వరలోనే బెంగళూర్ ను దాటి పోవడం ఖాయమని ఎంపీ సుమన్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక రంగాల్లో తెలంగాణ దేశంలో అగ్రభాగాన నిలుస్తోందని తెలిపారు. భవిష్యత్ లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ మెగా సిటీల జాబితాలో చేరనుందని తెలిపారు. కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందడాన్ని కాంగ్రెస్ నాయకులు ఆహ్వానించాలి తప్ప పిచ్చి విమర్శలు చేయకూడదని అన్నారు. మెచ్చుకోవడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండడం కాంగ్రెస్ నేతలకు మంచిదన్నారు.
నిరుద్యోగుల భుజాల మీద తుపాకులుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాల్చాలని కోదండరాం కుట్ర పన్నారని బాల్క సుమన్ మండిపడ్డారు. కోదండరాం కొలువు కోసమే కొట్లాట తప్ప మరొకటి కాదని ఆయన వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీలో కోదండరాం కూడా భాగం కల్పించామని ఆయన మరవొద్దన్నారు. మంత్రి కడియం శ్రీహరి పదిహేను రోజులకో సారి ఉద్యోగాల భర్తీ పై సమీక్షిస్తున్నారని తెలిపారు. రాజకీయ నిరుద్యోగుల కోసమే కోదండరాం తపనంతా అని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదేనని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు కోదండరాం వలలో చిక్కుకుని తమ భవిష్యత్ పాడు చేసుకోవద్దని ఎంపీ సుమన్ సూచించారు.