వినూత్న పంథాలో ప్రజలకు చేరువయ్యేందుకు రాష్ట్ర ఐటీ , పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలోని ప్రభుత్వం హైదరాబాద్ ప్రజానీకానికి ఏం చేసింది? ఇంకా ప్రభుత్వం ఏం చేయాల్సి ఉన్నది. ప్రజలు ఏం ఆశిస్తున్నారు. ? ఏయే మార్పులు కోరుతున్నారు. ఇలాంటి అంశాలపై మంత్రి కేటీఆర్ నేరుగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. నగర ప్రజలకు ఉన్న సందేహలు తీర్చేందుకు, మంత్రి స్వయంగా చొరవ
తీసుకొని ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
మన నగరం పేరుతో టౌన్హాల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ సోమవారం ఓ ట్వీట్లో తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు, ఎన్జీఓలతో నేరుగా చర్చించనున్నట్లు మంత్రి వెల్లడించారు.అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజానప్రతినిధులు ప్రజలతో ముఖాముఖి అయ్యేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. వీఐపీలు మొదలు సామాన్యుల వరకు ప్రజలతో మమేకం అయ్యేందుకు విశాల ప్రాంగణాలను ఎన్నుకొని వారితో సమావేశం అవుతుంటారు. భారతదేశంలో ఇలాంటి సంప్రదాయం లేదు. స్థానిక సంస్థల ప్రతినిధులు తప్ప ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలను…ఇలా ఎవరిని కలవాలన్నా అదో పెద్ద ప్రయాస.
తమ నియోజకవర్గ ఎమ్మెల్యేలను కలిసేందుకు పలువురు సామాన్యులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక మంత్రులతో మాట్లాడటం అంటే…అది అయ్యే పనేకాదు అనే భావన అందరిలో నాటుకుపోయింది. కానీ ప్రజలందరినీ భాగస్వామ్యం చేసినపుడే పరిపాలన ఫలాలు అందరికీ అందుతాయని భావించిన మంత్రి కేటీఆర్ ఈ క్రమంలో ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు, ఎన్జీఓలు ఇలా…ప్రజలందరితో మమేకం అయ్యేందుకు వేదిక కల్పించారు.