రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందించడానికి తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ఉదయం కరీంనగర్ జిల్లాలోని తీగలగుట్టపల్లి నుంచి ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి రెండు హెలిక్యాప్టర్లలో బయలుదేరిన సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు, అనుభంద రిజర్వాయర్లలను పరిశీలించారు.
తుపాకుల గూడెం బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్, అన్నారం బ్యారేజ్, సిరిపురం పంప్ హౌజ్ లను సందర్శించారు . ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును అధికారులను, వర్క్ ఏజెన్సీ లను అడిగి తెలుసుకున్నారు.
ప్రాజెక్టుల నిర్మాణానికి ఎలాంటి సహకారాన్నైనా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తుపాకుల గుడెం వద్ద గోదావరి వరద ప్రవాహం గురించి అధికారులను అడిగారు.ప్రాజెక్టులకు అవసరమైన రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రాజెక్టులు పూర్తి చేయడమే చాలా ముఖ్యమైన కార్యక్రమం అని, ఈ విషయాన్ని అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలు గమనంలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఎంపీలు పి. వినోద్ కుమార్, బాల్క సుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి సింగ్, డీజీపీ మహేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి, నీటి పారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాత్రి రామగుండం ఎన్టీపీసీలో సీఎం కేసీఆర్ బస చేస్తారు .