తెలంగాణలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలను ఈనెల 15 నుంచి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక౦గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో దేశం నలుమూలల నుంచే కాకుండా.. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాషా పండితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు, ప్రముఖులు మహాసభల్లో పాల్గొననున్నారు .
ఈ నేపధ్యంలో వారికీ తెలంగాణ వంటకాల రుచులు చూపించనున్నారు .దీనికి సంబంధించి రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన వంటకాలనింటిని అతిధులకు వడ్డించే౦దుకు సన్నాహాలు చేస్తున్నారు . మారుమూల ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన ఏ వంటకం ఉన్నా… దానికి తెలుగు మహాసభల మెనూలో చోటు దక్కనుంది.తెలంగాణ స్పెషల్ వంటకాలు అంటే… ముఖ్యంగా అందరికి బిర్యానీ గుర్తొస్తుంది. ఆ తర్వాత హలీం, అంకాపూర్ చికెన్, నాటుకోడి, రాగుల అంబలి, జున్ను, పచ్చిపులుసు అన్నం, గుత్తి వంకాయకూర , పుంటికూర కోడి బిర్యానీ, రాగిసంకటిలాంటివి చాలా ఉంటాయి. సర్వపిండి, సకినాలు, పల్లిగారెలు, చెగోడిలు, మురుకులు, నువ్వుల అరిసెలు, మురుమురాల లడ్డులు లాంటి చితుతిళ్లను కూడా ఈ సారి అందరికీ రుచి చూపించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం . మొత్తానికి తెలుగు సాహిత్యంతో పాటు తెలంగాణ వంటకాలకి కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం రావాలని తెలంగాణ సర్కార్ ఆశిస్తోంది.