టీమ్ ఇండియా వన్డే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి విశ్వరూపం చూపించాడు. బుధవారం శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో మరో ద్విశతకాన్ని నమోదు చేసి మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. మొత్తం 151 బంతుల్లో 13 బౌండరీలు, 12 సిక్సర్లతో 208 నాటౌట్ మెరుపు డబుల్ సెంచురీతో ఈ మహత్తరమైన రికార్డును నెలకొల్పాడు. ఇంతకు ముందు భారత ఆటగాళ్ళలో సచిన్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే డబుల్ సెంచరీలు సాధించారు. రోహిత్ సాధించిన ఈ అరుదైన విన్యాసంతో స్టేడియంలోని టీమిండియా అభిమానులు ఆనందంతో తాండవం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 392 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్తో పాటు శ్రేయాస్ అయ్యర్ (88: 70 బంతుల్లో 9×4, 2×6), శిఖర్ ధావన్ (68: 67 బంతుల్లో 9×4) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. తొలి వన్డేలో భారత్ టాప్ ఆర్డర్ని వణికించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన లక్మల్ కేవలం 8 ఓవర్లలోనే 71 పరుగులు సమర్పించుకోగా.. ప్రదీప్ 10 ఓవర్లలో ఏకంగా 106 పరుగులిచ్చుకున్నాడు. తొలి వన్డేలో డకౌట్గా వెనుదిరిగిన శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే బాదుడు మొదలెట్టగా.. క్రీజులో కుదురుకునే వరకూ రోహిత్ శర్మ నెమ్మదిగానే ఆడాడు.
వీరిద్దరూ తొలి వికెట్కి 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో జట్టు భారీ స్కోరుకి బాటలు వేసుకుంది. ఈ దశలో ధావన్ ఔటవగా.. అనంతరం వచ్చిన శ్రేయాస్ అయ్యర్తో కలిసి భారత్ స్కోరు బోర్డుని రోహిత్ శర్మ నడిపించాడు. ఈ క్రమంలోనే 115 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న రోహిత్ ఇక అక్కడ నుంచి టాప్ గేర్లో చెలరేగిపోయాడు. ఆకాశమే హద్దుగా వరుస సిక్సర్లు బాదేశాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 44వ ఓవర్ వేసిన లక్మల్ బౌలింగ్లో వరుసగా 6, 6, 6, 6 బాదేసి మొత్తం 26 పరుగులు పిండుకున్నాడు. తర్వాత ఓవర్ వేసిన ప్రదీప్కి సిక్సర్ల శిక్షే విధించిన రోహిత్.. మ్యాచ్ చివరి ఓవర్ మూడో బంతిని మిడ్ వికెట్గా తరలించి కెరీర్లో మూడో డబుల్ సెంచరీని పూర్తి చేసుకుని సంబరాలు చేసుకున్నాడు. శ్రీలంకపై రోహిత్కి ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం.