తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించే క్రమంలో ప్రవేశపెట్టిన సైబర్ సెక్యురిటీ పాలసీ అద్భుతంగా ఉందని ఇజ్రాయిల్కు చెందిన సైబర్ సెక్యురిటీ నిపుణుడు రామ్ లెవీ ప్రశంసించారు. ఈ విషయంలో రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ను ప్రశంసించకుండా ఉండలేమన్నారు. ఇటు సైబర్ భద్రతకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూనే…అటు పరిశ్రమకు సంబంధించిన ప్రోత్సాహాన్ని ఇచ్చేలా ఇందులో అంశాలున్నాయని అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలోఇంటర్నేషనల్ సైబర్ సెక్యురిటీ కాన్ఫరెన్స్-2017 గురువారం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తాము ఐటీ రంగాన్ని ముదంఉకు తీసుకుపోయేందుకు కృషిచేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెలాఖరులో సెక్యురిటీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్ఓసీ)ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. స్టేట్ డాటా సెంటర్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నారని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని భద్రపరిచే వేదికగా ఈ కేంద్రం నిలుస్తుందని వివరించారు. ఇజ్రాయిల్తో కలిసి ముందుకు సాగేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇజ్రాయిల్కు చెందిన ప్రముఖ సైబర్ సెక్యురిటీ సేవల సంస్థ కాన్ఫిడాస్ సీఈఓ రామ్లెవీ మాట్లాడుతూ ఇటు పరిశ్రమ అవసరాల పరంగా చూసిన, అటు రక్షణ చర్యల పరంగా చూసినా తెలంగాణ సైబర్ సెక్యురిటీ పాలసీ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రస్తుత తరుణంలో సైబర్ సెక్యురిటీ అత్యంత కీలకమైందని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై కీలక మందడుగు వేసిందని ప్రశంసించారు. సైబర్ సెక్యురిటీకి సంబంధించిన కీలక అంశాలపై మరింత అవగాహన పెరగాలని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో నిపుణులకు భవిష్యత్తులో విశేష డిమాండ్ ఉందని రామ్లెవీ జోస్యం చెప్పారు.