దేశంలో నేరాలు..హత్యలు..ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వదినతో బలవంతంగా తన పెళ్లి చేయడాన్ని జీర్ణించుకోలేని వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బిహార్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని గయా జిల్లా వినోబానగర్లో తొమ్మిదో తరగతి చదువుతున్న మహదేవ్ దాస్(15)కి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తన సొంత వదినతో ఇటీవల వివాహం జరిపించగా.. ఈ తంతు పూర్తయిన కొద్దిగంటల్లోనే మహదేవ్ తనువు చాలించాడు. ఇద్దరు పిల్లలు, తన కంటే పదేళ్లు పెద్దవయసు ఉన్న వదినతో వివాహం ఇష్టంలేకనే వరుడు సూసైడ్ చేసుకున్నట్లు గ్రామస్థులు చెప్తున్నారు. బాధితుడి తండ్రి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మహదేవ్ సోదరుడు గయా జిల్లాలోని ఓ సంస్థలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ 2013లో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో చనిపోయాడు. దీంతో నష్టపరిహారంగా ఆ సంస్థ మహదేవ్ కుటుంబానికి రూ.80వేలు చెల్లించింది. కానీ.. ఆ మొత్తాన్ని తమ కూతురుకే ఇవ్వాలని లేదా ఇంటి చిన్నకొడుకైన మహదేవ్తో పెళ్లి జరిపించాలని కోడలు తరపు బంధువులు ఒత్తిడి చేశారు. దివ్యాంగుడైన తాను కుటుంబ పోషణని దృష్టిలో పెట్టుకుని పరిహారాన్ని వారికి ఇవ్వలేక ఈ బలవంతపు పెళ్లికి ఒప్పుకున్నట్లు మహదేవ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. కానీ.. వివాహమైన కొద్ది గంటల్లోనే ఇలా చిన్న కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని తాను ఊహించలేదని ఆయన రోదించారు. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాల్య వివాహానికి హాజరైన 9 మంది బంధువుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.