రాష్ట్ర ఐటీ,పురపాలకశాఖమంత్రి కల్వకుంట్ల తారాకరామారావు ప్రసంగానికి బాచుపల్లి మండల పరిధిలోని ప్రగతినగర్ ప్రజలు ఫిదా అయ్యారు. శనివారం కొంపల్లిలోని పీఎస్ఆర్ గార్డెన్లో మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన హమార షహర్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో ఉత్పన్నమవుతున్న సమస్యల పరిష్కారానికి రాజకీయనాయకులు, అధికారులను మాత్రమే బాధ్యులను చేయకుండా పౌరులు సైతం బాధ్యాతయుతంగా వ్యవహారిస్తే ఆయా కాలనీలు, బస్తీలు సమస్యలు లేని ప్రాంతాలుగా ఆదర్శవంతంగా రూపొందుతాయని తెలిపారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నియోజకవర్గం పరిధిలోని ప్రగతినగర్ను తీసుకోవచ్చునని పేర్కొన్నారు.
ప్రగతినగర్ పరిధిలోని పాలకులు, ప్రజలు ఐక్యంగా పనిచేసి గ్రామాన్ని ఆదర్శంగా రూపొందించినట్లు పలుమార్లు గుర్తుచేశారు. ప్రధానంగా పారిశుధ్య నిర్వాహాణ, తాగునీటి సరఫరా, ప్లాస్టిక్ వినియోగం, మధ్యపాన నిషేదం వంటి విషయాలలో అక్కడి ప్రజలు ఏవిధంగా వ్యవహరిస్తున్నారో ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవచ్చునని తెలిపారు. అయితే టీ న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా తిలకించిన గ్రామస్థులు తమ గ్రామాభివృద్దిపై మంత్రి కేటీఆర్ స్వయంగా కితాబును ఇవ్వడం పట్ల స్థానికుల్లో సంపూర్ణ హర్షం వ్యక్తం అవుతుంది.
రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖమంత్రి కేటీఆర్ మాగ్రామంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో పాటు ఇక్కడ చేపట్టిన అభివృద్ది పనుల విషయంలో తరచూ కితాబును ఇస్తుండడం మాపంచాయతీకి గర్వకారణంగా నిలుస్తుంది. అదే సమయంలో మరింత బాధ్యాతయుతంగా పనిచేసేందుకు ఉపకరిస్తుంది. గ్రామాన్ని ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కోనడం పట్ల మంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.