ఏపీ రాజకీయాలకు సంబంధించి ఓ అంగ్ల పత్రిక కథనం కలకలం రేపడమే కాకుండా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆ పత్రికలో రాసిన దాని ప్రకారం చూస్తే ఏపీలో జరుగనున్న వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందో అని చంద్రబాబు సర్వేలో తేలింది. ఇటీవల సీఎం నిర్వహించిన సర్వే ప్రకారం ఏకంగా 80 మంది ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అంటే కేవలం 24 నలుగురు మినహా మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలందరికీ ప్రజాగ్రహం తప్పడం లేదు. అంతేగాకుండా కేవలం 8 మంది మంత్రులు మాత్రమే గట్టెక్కే అవకాశం కనిపిస్తోంది. అంటే అసెంబ్లీ నుంచి క్యాబినెట్ లో ఉన్న 22 మందికి గాను సీఎంతో పాటు 8 మందికి మాత్రమే విజయావకాశాలుండగా, మిగిలిన వారంతా ఓటమి బాటలో ఉన్నట్టు తెలుస్తోంది.
దాంతో ఈ సర్వే ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. విజయం సాదించే అవకాశాలున్న మంత్రుల జాబితాపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ 8 మంది ఎవరనే దానిపై అమరావతి సెక్రటేరియేట్ లోనూ, టీడీపీ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. పలువురి అభిప్రాయం ప్రకారం ప్రస్తుతానికి కళా వెంకట్రావు, సుజయ రంగారావు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కేఎస్ జవహార్, కాల్వ శ్రీనివాసులు, శిద్ధా రాఘవరావు, అమర్నాధ్ రెడ్డి మాత్రం గట్టెక్కే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. వారిలో కూడా కొందరికి ప్రత్యర్థులను బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. ఏమయినా ఈ సర్వే తెలుగుదేశం అధినేతను గందరగోళంలో పడేసిందని అంటున్నారు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ సిట్టింగులను మార్చకపోతే మంత్రుల సహా చాలామందికి సీన్ సితార అయిపోవడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.