ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా జన మనోరంజక యువనేత జగన్ అని ఇలపావులూరి మురళీ మోహన రావు గారు ఒక స్టొరీ రాశారు ..యదాతధంగా మీకోసం ..
అధికారంలో ఉండి ప్రజలకు మేలు చేసి చరిత్రలో, ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయిన నేతలు తెలుగువారిలో ఇద్దరు మాత్రమే కనిపిస్తారు. ఒకరు ఎన్టీఆర్, మరొకరు వైఎస్సార్… ఆ ఇద్దరి మేలుకలయిక ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్. అసలు అధికారం అనేదాన్ని చూడకుండా, కేవలం ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమైన వైసిపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి జనరంజక నేత అనే పదానికి నిలువెత్తు రూపంగా ప్రజల మదిలో కొలువు సంపాదించుకున్నారు.
జగన్ అనే రెండు అక్షరాల పదం ప్రత్యర్థుల గుండెల్లో ఒక డైనమైట్. ఒక అణుబాంబు.ఆర్తులు, అభాగ్యులు, పాలకుల అరాచకాలకు బలైపోతున్న ప్రజల గుండెల్లో ఒక ఆశాకిరణంఆయన ఎదో చేస్తాడు అని, తమను ఉద్ధరిస్తాడని, తమ కడగండ్లు తీరుస్తాడని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అనేది ఆయన ప్రజాసంకల్ప యాత్రలో ప్రస్ఫుటమౌతున్న వాస్తవం.
ప్రజలతరఫున గొంతెత్తే వారికి కస్టాలు తప్పవు. వారిని చూస్తే పాలకులకు, కుళ్ళు కుతంత్రాల రాజకీయాలను నడిపి ప్రజాధనాన్ని దోచుకునే బందిపోట్లకు ఎప్పుడూ వణుకే. ముఖ్యమంత్రి మొదలుకుని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చోటా నాయకులు సైతం నిత్యం జగన్ స్మరణ చేస్తూ తరిస్తున్నారు… పురాణాలలోని దానవుల మాదిరిగా. వారికి మోక్షం ప్రసాదించక తప్పని పరిస్థితి వస్తుంది… ఏనాటికైనా.
కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ లను ధిక్కరించి బతికినవాడు లేడు. బ్రహ్మానంద రెడ్డి, చెన్నారెడ్డి, సంజీవరెడ్డి, శరద్ పవార్ లాంటి బలమైన నాయకులను అవమానించి వేధించి, చివరకు తన పాదాక్రాంతులను చేసుకున్న పార్టీ అది. కానీ, ఆ ఘనతకు ఫుల్ స్టాప్ పెట్టిన వీరాగ్రేసరుడు జగన్. “నువ్వెంత… నీ పార్టీ ఎంత అని ప్రశ్నించి పార్లమెంట్ మెంబెర్ పదవిని ఎంగిలాకులా సోనియా ముఖానే కొట్టి పద్మవ్యూహం లాంటి పార్టీనుంచి బయటకి వచ్చిన అభిమన్యుడు జగన్. సాలెగూటిలో చిక్కుకున్న ఈగ ప్రాణాలతో బయటకి రావడం అసంభవం. కానీ, జగన్ మాత్రం అధికారంలో ఉన్న సోనియాను ఎదిరించి బయటకి వచ్చాడంటే ఆ గుండె ధైర్యం తెలుగువాడి ‘వాడి’, ‘వేడి’ ఎంత పదునైనదో లోకానికి చాటిచెప్పింది.
కేసులు పెట్టినా, కోర్టులు చుట్టూ తిప్పినా, వేధించినా, కారాగారంలో బంధించినా, మీసం మెలివేసాడు తప్ప, తొడ కొట్టాడు తప్ప చేతులు జోడించలేదు. సింహాన్ని బోనులో బంధిస్తే దాని పౌరుషం తగ్గుతుందా? చివరకు సోనియా సర్వనాశనం అయిపొయింది. ఒకప్పుడు వైఎస్సాఆర్ దయతో ముప్ఫయి మూడు స్థానాలను ఆంధ్రప్రదేశ్ నుంచి పొందిన కాంగ్రెస్ దేశం మొత్తం మీద నలభైనాలుగు సీట్లు సాధించింది!!!
కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తానని ఎన్టీఆర్ గర్జించేవారు. కానీ ఆయన ఆయన కాంగ్రెస్ ను అధికారం నుంచి దించగలిగారు కానీ, భూస్థాపితం చేయలేకపోయారు. కానీ, యువకిశోరం జగన్ ఆ పని చేశారు. ఆంధ్రుల సహకారంతో కాంగ్రెస్ ను నూరు అడుగుల లోతులో పాతేశారు. వైసిపి అనే పార్టీ లేకపోతె కాంగ్రెస్ కొన్ని సీట్లు సాధించి ఉండేది. కానీ, సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ కు మరణశాసనం లిఖించి ఆంధ్రప్రదేశ్ ను రెండు పార్టీల రాష్ట్రంగా మార్చేశారు.
ఇవాళ యువత జగన్ ను ఆరాధిస్తున్నది అంటే ఆయనలోని సాహసం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, తలవంచని ధీరత్వం, చీకట్లో వెళ్లి పెద్దల కాళ్ళు పట్టుకోని నైజం కారణాలు. జగన్ పై పెట్టిన అక్రమకేసులు నిలిచేవి కావు. ఏనాటికైనా ఆయన క్లీన్ ఇమేజ్ తో పులిలా బయటకు వస్తాడు. ఆంధ్రప్రదేశ్ అధినేత అవుతాడు. అరచేతితో సూర్యోదయాన్ని ఆపడం ఎంత అసాధ్యమో, జగన్ ను ముఖ్యమంత్రిగా కాకుండా కుట్రలు చెయ్యడం కూడా అంతే అసాధ్యం. అది ఇవాళ జరగవచ్చు.. రేపు జరగవచ్చు లేదా ఎల్లుండి జరగవచ్చు. మబ్బు పట్టినపుడు వర్షం రాక మానదు…. సమయం వచ్చినపుడు ఇది కూడా జరగక మానదు.జగన్ మోహన్ రెడ్డి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాపాలకుడై చిరయశస్సు తో, ప్రజల శరీరాల్లో అణువణువునా నిలిచిపోవాలని ఆకాంక్షిస్తున్నాను.జగన్ గజదొంగ, కబ్జాకోరు అని కూతలు కూసేవారికి సమాధానం చెప్పొచ్చు. ఆయన ప్రజాభిమానాన్ని దోచిన గజదొంగ. ప్రజల హృదయాలను ఆక్రమించిన కబ్జాకోరు.