తెలంగాణ రాష్ట్రంలో 55% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అందరినీ బతికించేది వ్యవసాయమే..అన్నింటికీ మూలం నీళ్లే, ఆ నీళ్లేకోసమే సీఎం కేసీఆర్ నిద్రలేని రాత్రులతో ప్రాజెక్ట్ లు నిర్మిస్తున్నారని జగదీష్ రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట మార్కెట్ యార్డ్ నుండి ఖమ్మం రోడ్ వరకు రైతుల సౌకర్యం కోసం రూ.5కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎంతో శ్రమించి కడుతున్న ప్రాజెక్టులకు కాంగ్రేస్ నాయకులు మోకాలడ్డుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలకులు నీళ్లు లేని చోట ప్రాజెక్ట్ లకు డిజైన్ చేశారని.. సీఎం కేసీఆర్ రీ డిజైన్ లతో తెలంగాణలో వ్యవసాయ పండుగకు శ్రీకారం చుట్టారని జగదీష్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో చెలిమెలు, ఊట బావులు , మోట బావులతో వ్యవసాయం ఉండేది. అటువంటి వ్యవసాయాన్ని పాతాళంలోకి నెట్టిన పాపం కాంగ్రెస్ దేనని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన పాపాలను సీఎం కేసీఆర్ ప్రక్షాళన చేస్తున్నారని తెలిపారు.