దేశ రాజధానిలో దారుణంగా బాలికలపై రేప్ లు జరుగుతున్నాయి. నిర్భయ ఘటనతో చట్టాలు తీసుకువచ్చిన కామాంధుల నుండి పాపం పసి మొగ్గులు తప్పించుకోలేక పోతున్నారు. తాజాగా సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు డిప్యుటేషన్ మీద వచ్చిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తాను మనిషినన్న విషయాన్ని మరిచిపోయాడు. 45 ఏళ్ల వయసులో కామ పిశాచిలా మారి.. ఏడేళ్ల బాలికకు రూ.10 ఆశచూపి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ బాలిక తమ్ముడు ముందే ఆమె రేప్ చేయడం మరింత దారుణం. ఈ ఘటన బుధవారం సాయంత్రం గ్రేటర్ నొయిడాలోని గౌతమ్ బుద్ధ నగర్లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..
పోలీస్ కానిస్టేబుల్ అయిన సుభాష్ సింగ్ డిప్యుటేషన్ మీద సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు వచ్చాడు. గౌతమ్ బుద్ధ నగర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం ఎవరూలేని సమయంలో తమ్ముడితో ఆడుకుంటున్న బాలికను పిలిచాడు. ఆమెకు రూ.10 ఆశచూపి గదిలోకి తీసుకెళ్లాడు. తమ్ముడి ముందే ఆ బాలికపై అరగంటపాటు లైంగిక దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించాడు. బాధతో బాలిక గట్టిగా ఏడ్వడంతో చుట్టుపక్కల జనాలు అక్కడ గుమిగూడారు. బాలికను తల్లిదండ్రులు విషయం అడిగి తెలుసుకున్నారు.
ఈ తతంగం మొత్తం తెలియక, అంతా బాగానే ఉంది అనుకొని భావించిన సుభాష్ సింగ్ గురువారం ఉదయం తన అద్దెకు ఉంటున్న ఇంటికి వచ్చాడు. వెంటనే అతన్ని పట్టుకున్న బాలిక తల్లిదండ్రులు, స్థానికులు ఈ విషయంపై నిలదీశారు. ఈ ఘాతుకానికి పాల్పడింది అతనే అని తేల్చుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సుభాష్పై రేప్, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు సూరజ్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అఖిలేష్ ప్రధాన్ చెప్పారు. నిందితుడికి కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించిందని చెప్పారు.