ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయత్ర నెల్లూరులో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా తజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని జగన్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య.. అధికార టీడీపీకి నిద్ర లేకుండా చేస్తోంది. దీంతో జగన్ చేసిన ఆ సంచలన వ్యాఖ్య రేపిన సెగలు ఇంకా చల్లబడకుండానే.. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు టీడీపీకి పుండుమీద కారం జల్లినట్టు అయ్యింది. ఆయన ఏకంగా వైసీపీ కార్యాలయంలోనే కూర్చొని మాట్లాడుతూ… పార్టీ మారిన వారు మంత్రులుగా కొనసాగడం ఏమిటంటూ చేసిన వ్యాఖ్య మరో పెద్ద సంచలనమే అయ్యింది.
అంతే కాకుండా ఫిరాయింపులు చట్టబద్ధం చేస్తూ చట్టం చేసేయడమే మంచిదని చెప్పడం రాజకీయాలను బాగా హీటెక్కించింది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్లో పర్యటిస్తున్న క్రమంలో దీనిపై ఆయన స్పందన ఎలా వుండబోతుందా అన్న ఆసక్తి అందరిలో మొదలైంది. బీజేపీకి ఫిరాయింపులు ఇప్పుడు గుర్తుకు రావడంపైనా గట్టిగానే విమర్శలు మొదలు అయ్యాయి. టీడీపీ తమ మిత్రపక్షంతో ఇన్నాళ్లు ఆడుతున్న మైండ్ గేమ్ ఇప్పుడు ఆ పార్టీ తమ పై ప్రయోగించడంతో టీడీపీ నేతలు కంగారు పడుతున్నారు. అయితే ఏపీ రాజకీయాలు ఎటు పోతున్నాయో… ఎవరు ఎవరితో జట్టు కడతారో… బీజేపీ ఏమి చేయబోతుందో … అనే విషయాల పై ఏపీ రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్యుల్లోనూ ఆసక్తిగా మారిపోయాయి.