మనం ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే అది భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు చూశాం. కాని హర్యానాకి చెందిన ఓ యువతి మాత్రం ప్రేమించిన వాడు మోసం చేశాడని ఏకంగా అతని ఇంటికే వెళ్లి వీరంగం సృష్టించింది. డ్యాన్స్ చేసి హల్చల్ చేసింది.
వివరాల్లోకెళితే.. హర్యానాలోని పటౌడీ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి .ఇదే ప్రాంతానికి చెందిన ఓ కుర్రాడిని ప్రేమించింది. అతను కూడా ఆమెను ప్రేమించినట్టే నటించి కొన్నాళ్లకు వదిలేశాడు. అది తట్టుకోలేక ఆ యువతి పీకలదాకా తాగి ప్రియుడి ఇంటికి వెళ్లింది. తనతో పాటు ఓ డీజేను కూడా వెంటబెట్టుకెళ్లింది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘రాజా హిందుస్థానీ’ సినిమాలోని ‘తేరే ఇష్క్ మే నాచేంగే’ అనే పాటకు డ్యాన్స్ చేసి హల్చల్ చేసింది.
ఆమె చిందులు చూసి చుట్టుపక్కల వారంతా నోరెళ్లబెట్టుకున్నారు. అంత మంది గుమిగూడి చూస్తున్నా తను మాత్రం ఏమీ పట్టనట్లు డ్యాన్స్ చేస్తూనే ఉంది. అక్కడే ఉన్న సందీప్ అనే వ్యక్తి ఆ యువతి డ్యాన్స్ చేస్తున్నప్పుడు వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఈ వీడియో కాస్తా వైరల్ అవుతోంది. సాధారణంగా ప్రేమలో విఫలమైతే అబ్బాయిలు తాగి ఇలా చేస్తుంటారని కానీ ఓ అమ్మాయి ఇలా డ్యాన్స్ చేయడం మొదటిసారి చూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరో పక్క నెటిజన్లు మాత్రం ఆమె మనసు ఎంత గాయపడి ఉంటే అలా చేసి ఉంటుందని మద్దతు పలుకుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.