ఉప్పల్లో సంచలనం సృష్టించిన చిన్నారి నరబలి కేసును ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా పోలీసులు ఛేదించారు .చంద్ర గ్రహణం రోజున క్షుద్ర పూజలు చేయించిన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ మూడు నెలల పసికందును బలి ఇచ్చిన సంగతి తెలిసిందే. డాబా మీద చిన్నారి తల కనిపించడంతో పక్కింటి వాళ్లు ఫిర్యాదు చేశారు. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు కేసును చేధించారు. చాలా కాలం వరకూ ఆ చిన్నారి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని వాదించిన రాజశేఖర్ నిజాలు వెల్లడించాడు.నరబలి ఇచ్చిన రాజశేఖర్, ఆయన భార్య శ్రీలతతో పాటు మరో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసి సాయంత్రం మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా కేసు వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.
భార్యకు అనారోగ్యంగా ఉండటంతో.. మాంత్రికుడిని ఆశ్రయించినట్లు చెప్పాడు. అతడి ఆధ్వర్యంలోనే క్షుద్రపూజలు నిర్వహించి.. చిన్నారిని బలి ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. ఇంట్లోని రక్తపు మరకలను రసాయనాలతో కడిగినట్లు అంగీకరించాడు.
కానీ మొండెన్ని ఎక్కడ వేసిన సంగతి మాత్రం ఇంతకాలం బయటపెట్టలేదు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి అసలు నిజాలు బయటపెట్టాడు. గ్రహణం రోజున అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య, తాను కలిసి నగ్నంగా పూజలు చేశామని చెప్పాడు. శిశువును బలి ఇచ్చాక మాంత్రికుడి సూచనల మేరకు తలను డాబా మీద ఉంచానని చెప్పిన రాజశేఖర్.. మొండేన్ని మూసీలో విసిరేసినట్లు చెప్పాడు. రాజశేఖర్కు మూఢ నమ్మకాలు ఎక్కవ అని.. అందువల్లే మంత్రగాళ్ల మాటలు నమ్మి ఇంత దారుణానికి ఒడిగట్టాడని సీపీ తెలిపారు. అయితే.. నిందితులు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని… అందుకే నరబలి కేసును ఛేదించడానికి ఇంత సమయం పట్టిందన్నారు.