పురిటినొప్పికి ముందే గర్భిణి అమ్మఒడి వాహనంలో సురక్షితంగా ప్రభుత్వ దవాఖానకు చేరుతున్నది. అంతే సురక్షితంగా బిడ్డ, కుటుంబంతో సహా ఇంటికి చేరుతున్నది. గర్భిణుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి 102 వాహనాలు విస్తృత సేవలు అందిస్తున్నాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన గర్భిణులను ప్రసవ సమయానికి ముందు దవాఖానకు చేర్చడం, ప్రసవం తర్వాత పుట్టిన బిడ్డతోపాటు కుటుంబసభ్యులను కూడా సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు వీటిని ప్రవేశపెట్టారు. మాతాశిశు రక్షణ ఉద్దేశంతో అందుబాటులోకి తీసుకువచ్చిన అమ్మఒడి 102 వాహనాన్ని నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించారు. ఈ నెల రోజుల్లో ఈ వాహనాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 8,817 మంది గర్భిణులకు లబ్ధిచేకూరింది.