తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి ఫలించింది. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిపాలన పరమైన అనుమతులకు బుధవారం శాసన సభ ఆమోదం తెలుపడంతో టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కార్మిక, ధార్మిక క్షేత్రాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాలో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.36.45 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో నర్సింగ్ కళాశాల నిర్మాణానికి అడుగులు పడుతుండడంతో వైద్య, ఆరోగ్య సిబ్బందితోపాటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలందరికి కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానలను బలోపేతం చేస్తున్నది. ఇందుకోసం జిల్లా ప్రధాన దవాఖానల్లో అన్ని విభాగాలను ఆధునికీకరించి, అధునాతన పరికరాలను సమకూర్చింది. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని వంద పడకల దవాఖానలో అవుట్ పేషంట్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. మరోవైపు సర్కారు దవాఖానాల్లో ప్రసవించిన గర్భిణులకు అమ్మాయి పుడితే రూ.13 వేలు, మగబిడ్డకు జన్మనిస్తే రూ.12 వేల చొప్పున అందిస్తున్నారు. పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్లు అందజేస్తున్నారు. మాతాశిశుసంరక్షణ కేంద్రం, కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్, రక్త శుద్ది యంత్రాల లాంటి అత్యాధునిక ఏర్పాట్లు చేయడంతో రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ప్రస్తుతం రోజుకు 600 నుంచి 700 వరకు అవుట్ పేషంట్లు వస్తుండగా, ఇన్పేషంట్లు సంఖ్య కూడా వంద దాటుతున్నది. ఈ క్రమంలో రోగులకు వైద్య సేవలందించడానికి సరిపడా నర్సులు లేక సేవల్లో జాప్యం జరుగుతుంది. ఈ జాప్యాన్ని నివారించడానికి నర్సింగ్ కళాశాల ఎంతో దోహదపడుతుంది.