“వచ్చే ఎన్నికల్లో కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజక వర్గాల్లో గులాబీ జెండా రెప రెప లాడడం ఖాయం అని… ఈ ఫలితాలు ఎవరూ మార్చలేరని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు..బోధన్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రగతి సభకు మంత్రి హరీశ్రావు, ఎంపీ కవిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. బోధన్ నియోజకవర్గంలో 70వేల ఎకరాలకు నీళ్లు అందించబోతున్నమని ..ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు కావాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో నిజామాబాద్ జిల్లా ఆగమైందని, కాంగ్రెస్ హయాంలో ఏనాడూ బోధన్ గడ్డకు నీళ్లు రాలేదన్నారు. తాము రూ.1,070 కోట్లతో ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం చేపట్టామని, ఈ ఏడాదిలోనే కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీకి తీసుకొస్తున్నమని హరీశ్ రావు వెల్లడించారు.
నిజాంసాగర్కు మల్లన్నసాగర్ ద్వారా కాళేశ్వరం నీళ్లు వస్తయి. ప్యాకేజీ 20,21 ద్వారా బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తామని హరీశ్ రావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లిస్తమని చెప్పారు. సీడబ్ల్యూసీ ఛైర్మన్ మసూద్ హుస్సేన్ కాళేశ్వరం ప్రాజెక్టు చూసి అబ్బురపడ్డారని హరీశ్రావు అన్నారు. మా ఇంజినీర్లను కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి పంపిస్తాం. మా ఇంజినీర్లకు నేర్పించండని సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుస్సేన్ తమను కోరారని హరీశ్రావు తెలిపారు. కాళేశ్వరం నుంచి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరందించబోతున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రకటన చేసి కాంగ్రెస్ వెనక్కి తగ్గిన రోజు నుంచి తెలంగాణ బిల్లు పాసయ్యేంత వరకు నిరాహార దీక్ష టెంట్ ఎత్తేయని గడ్డ బోధన్ అన్నారు. గతంలో సుదర్శన్ రెడ్డి నీళ్ల మంత్రిగా ఉన్నపుడు బోధన్ నియోజకవర్గంలో ఒక్క పని జరుగలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రైతు కాబట్టి రైతుల బాధలు తెలుసన్నారు. ఎర్రజొన్నలు కొనుగోలు చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. రైతులకు ఎకరానికి 4 వేల చొప్పున రెండు పంటలకు పెట్టుబడి అందించబోతున్నమన్నారు.