సాధారణంగా మనం తల నొప్పి ఉన్నప్పుడు ,బాగా మత్తుగా ఉన్నప్పుడు వేడివేడిగా ఒక కమ్మని అల్లం టీ త్రాగితే ఎలాంటి మజా వస్తుందో మనందరికి తెలిసిందే. అల్లం టీ అంటే తెలియని వారు ఉండరు. అలాంటి టీ ఒక్కసారి త్రాగితే ఎంతటివారైన ఫిదా కావాల్సిందే. అయితే మనం తయారు చేసే అల్లం టీకి ఆ అమెరికా దేశం మహిళ ఫిదా అయిపోయింది. దీంతో ఆ టీని తన స్వదేశంలో తాను ఉంటున్న ప్రాంతంలో తయారు చేసి అమ్మి కొన్ని కోట్లను గడించింది.వివరాల్లోకి వెళ్తే…ఆమె పేరు బ్రూక్ ఎడ్డీ. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో నివాసముంటుంది.ఆమె 2002 సంవత్సరంలో మహారాష్ట్రలో స్వాధ్యాయ్ పరివార్ అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇండియాకు వచ్చింది.
అయితే ఆమె స్వతహాగా సామాజిక సేవకురాలు. అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని వాలంటీర్గా తన వంతు సేవ చేస్తుంటుంది. అయితే అలా ఇండియాకు వచ్చిన ఈమెకు మన అల్లం టీ బాగా నచ్చేసింది. దీంతో తన సొంత దేశానికి వెళ్లాక తాను ఉంటున్న ప్రాంతంలో అల్లం టీని తయారు చేసి అమ్మడం మొదలు పెట్టింది.అలా బ్రూక్ ఎడ్డీ టీ తయారు చేయడం ఏమో గానీ మన అల్లం టీ అక్కడి దేశ వాసులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. దీంతో ఎడ్డీ వ్యాపారం బాగానే సాగింది. అలా ఆమె ఏకంగా టీ అమ్మడం ద్వారా 35 మిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపుగా రూ.227 కోట్లు) సంపాదించింది.
అయితే ఇక్కడ ఇంట్రస్టింగ్ ఏమిటంటే అంత సంపాదించినా ఆ మొత్తాన్ని ఆమె అట్టే తన దగ్గర పెట్టుకోలేదు. తాను సమాజ సేవ చేస్తుంది కనుక గీత (Give, Inspire, Take Action) పేరిట ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసింది . దాని ద్వారా భారతదేశంలో ఉన్న పేదలకు సహాయం చేస్తోంది.తాను ఇండియా నుంచి చాలా నేర్చుకున్నానని, అందుకే ఆ జ్ఞానం వల్ల వచ్చిన డబ్బును తిరిగి వారి బాగు కోసమే వాడుతున్నానని ఆమె గర్వంగా చెబుతోంది. ఆమె ఇలా చేస్తున్నందుకు మనం ఆమెను కచ్చితంగా అభినందించాల్సిందే..!