బిజెపిని వీడే విషయాన్ని రెండు రోజుల తర్వాత వెల్లడించనున్నట్టు కర్నూల్ జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు. బిజెపికి గుడ్బై చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో బుధవారం నాడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రంలో, జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన తన అనుచరులతో చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ మారాలని ఆయన నిర్ణయం తీసుకొన్నారని సమాచారం. మరో రెండు రోజుల్లో ప్రకటిస్తానని కాటసాని రాం భూపాల్ రెడ్డి ప్రకటించనున్నట్టు తేల్చి చెప్పారు . పార్టీ మారాలని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పారు.
అయితే బిజెపికి గుడ్బై చెప్పి కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరుతారనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. బుధవారం నాడు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కూడ మెజారిటీ కార్యకర్తలు వైసీపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్టుగా ఆయన చెప్పారు.అయితే ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కాటసారి రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పాణ్యం నుండి పోటీ చేస్తానని కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు. అయితే వైసీపీ నుండి వచ్చే ఎన్నికల్లో కాటసానికి టిక్కెట్టు ఇస్తారా అనే చర్చ సాగుతోంది, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ప్రకటనపై ఏపీ రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చ సాగుతోంది. వైసీపీలో చేరాలని తన అనుచరులు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ప్రకటించారు. త్వరలోనే కర్నూల్ జిల్లా రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు ఉన్నాయని సీనియర్ రాజకీయ నేతలు అంటున్నారు.