ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-11లో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. ఢిల్లీ డేర్డెవిల్స్ క్రికెటర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు గంభీర్ ప్రకటించాడు. ఐపీఎల్ పదకొండో సీజన్ను ఢిల్లీ టీమ్ మరీ దారుణంగా ప్రారంభించింది. ఆడిన 6 మ్యాచుల్లో ఐదింట్లో ఓడింది. కోల్కతా నైట్రైడర్స్లో కెప్టెన్గా, ప్లేయర్గా సక్సెసైన గంభీర్.. అదే ఫామ్ను ఢిల్లీ టీమ్తో కొనసాగించలేకపోయాడు. ఆరు మ్యాచుల్లో గంభీర్ 85 రన్స్ మాత్రమే చేశాడు. తొలి మ్యాచ్లోనే 55 పరుగులతో రాణించాడు.ఆ తర్వాత ఐదు మ్యాచుల్లో ఘోరంగా విఫలమయ్యాడు . కాగా, గంభీర్ స్థానంలో కొత్త కుర్రాడు శ్రేయస్ అయ్యర్కు ఢిల్లీ ఫ్రాంఛైజీ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం మీడియా సమావేశంలో ఢిల్లీ మేనేజ్మెంట్ తమ నిర్ణయాన్ని వెల్లడించింది.
గంభీర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం నా వ్యక్తిగత నిర్ణయం. జట్టుకు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాను. జట్టు ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాను. కెప్టెన్గా దిగిపోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా. శ్రేయస్ అయ్యర్ నూతన కెప్టెన్గా ఢిల్లీ డేర్డెవిల్స్ బాధ్యతలు స్వీకరిస్తాడు. అతడికి నా సహకారం ఎప్పటికీ ఉంటుందని’ భావోద్వేగానికి లోనయ్యాడు.