శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలోకి చేరేందుకు సిద్దమయ్యారు. కిల్లి కృపారాణి వైసీపీలో చేరబోతున్నట్లు సంవత్సరం క్రితమే జోరుగా ప్రచారం జరిగింది. కాని అప్పుడు జరగలేదు ప్రస్తుతం ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రకు ఆదరణ పెరుగుతున్నట్లు కనిపించడంతో ఇక ఇదే మంచి తరుణమని కిల్లి కృపారాణి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారట. డాక్టర్ అయిన కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీ తరుపున 2004 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఎంపీగా పోటీచేసి ఓడిపోయింది. ఆ తరువాత 2009 జరిగిన ఎన్నికలలో నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన కింజరాపు ఎర్రన్నాయుడు పై భారీ మెజారిటీతో గెలిచింది. ఆ క్రమంలో కేంద్ర సమాచార మరియు టెలీకమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాలో బలమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత. నిజానికి కిల్లి కృపారాణి వైసిపిలో చేరబోతున్నట్లు సుమారు 10 నెలల క్రితమే జోరుగా ప్రచారం జరిగింది. మరోవైపు గతంలో వైసీపీలో ఎవరైతే చేరేందుకు సుముఖత చూపి ఆ తరువాత సైలెంట్ అయ్యారో ఆ నేతలందరు ఇప్పుడు వైసీపీలోకి చేరడం ఖచ్చితం అయ్యింది. ఇందులో బాగంగానే అయితే జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నప్పుడు ఆ సమయంలో పార్టీలో చేరాలని భావిస్తున్నారట. పాదయాత్ర శ్రీకాకుళం చేరేందుకు ఇంకా చాలా వ్యవధి ఉన్నందున కిల్లి కృపారాణిని ముందే పార్టీలో చేరేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందట. అలా వీలుకాని పక్షంలో ముందుగా ఆమెతో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన ఇప్పించాలని ప్రయత్నం చేస్తోందట.
అయితే వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నా ఇంకా కిల్లి కృపారాణి ఇంకా డైలమాలోనే ఉన్నారని, అందుకే జగన్ పాదయాత్ర శ్రీకాకుళం చేరుకున్నప్పుడు పార్టీలో చేరుతానని చెబుతున్నట్లు తెలుస్తోంది. అలా అయితే సమీకరణాలు అంచనా వేసేందుకు ఇంకా వ్యవధి దొరుకుతుందని ఆమె ఆలోచన అంటున్నారు. కిల్లి కృపారాణి స్వస్థలం టెక్కలి. ఆమె వైసీపీలో చేరితే కళింగ సామాజికవర్గం బలంగా ఉన్న పలాసా నియోజకవర్గం నుంచి ఆమె పోటీకి దిగే అవకాశాలు ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వైసిపిలో చేరే విషయం వీలైనంత త్వరలోనే ఆమెతోనే ప్రకటింపచేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం