గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణం అట్టుడికిపోయింది. తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి ఘటనతో గుంటూరు జిల్లా మొత్తం ఒక్కసారిగా భగ్గుమంది. రోజూ ‘తాతా’ అని పిలిచే చిన్నారిపై అతి కిరాతకంగా నిందితుడు సుబ్బయ్య ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక బాధతో వదిలేయమని ఏడుస్తూ ఎంత ప్రాథేయపడ్డా కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ మృగాడి మనస్సు కరగలేదు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి ఊరు నుంచి పరారయ్యాడు.
ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో గురువారం రాత్రి దాచేపల్లి వాసులు అద్దంకి–నార్కెట్పల్లి జాతీయ రహదారిపై బైఠాయించి తెల్లవార్లూ ఆందోళన చేశారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం కుల, మతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి చేరి బాలిక కుటుంబానికి మద్దతుగా నిలిచారు. నిందితులను అరెస్టుచేసి కఠినంగా శిక్షించే వరకు ఆందోళన విరమించేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. వైసీపీ నేతలు కాసు మహేష్రెడ్డి, జంగా కృష్ణమూర్తితో పాటు, పలు ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. సీఎం, స్పీకర్, డీఐజీ, ఐజీ, ఎస్పీలు ఉన్న జిల్లాలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. మూడు నెలల వ్యవధిలో జిల్లాలో ఇలాంటివి 40 సంఘటనలు చోటుచేసుకున్నాయని, అయినా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేగాక చంద్రబాబుకి ఆడపిల్లలు లేరు కాబట్టి .. ఆదపిల్లల విలువ తెలియదు అని రోజా అన్నారు.