వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లా,గుడివాడలో విజయవంతంగా కొనసాగుతుంది.వేలాది మంది జగన్ తో పాటు పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్నారు.అడుగడుగునా జనం జగన్ కు నీరాజనం పడుతున్నారు.ఈ క్రమంలోనే ఇవాళ గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు నుంచి జగన్ 155వ రోజు పాదయాత్ర ప్రారంభించారు.
గుడివాడ మండలం సిద్దాంతం మీదుగా జగన్ బొమ్ములూరు చేరుకుని అనంతరం బొమ్ములూరు శివారు లారీ స్టాండ్ చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అక్కడ నుంచి మార్కెట్ యార్డు పెద్దకాలువ సెంటర్ మీదుగా గుడివాడ చేరుకుని గుడివాడ నెహ్రూ చౌక్లో బహిరంగ సభకు హాజరవుతారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ శ్రేణులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నాని పిలుపునిచ్చారు.