ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులో కొత్త టెన్షన్ మొదలైందా? తన అవినీతి బయటపడుతుందని ఆయనలో ఆవేదన మొదలయిందా?అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో పేర్కొన్న … ‘జనాకర్షక పథకాలపై సమీక్ష’ అనే అంశం అభ్యంతరకరమని ఏపీ సీఎం ప్రధాని మోడీకి మరోసారి లేఖ రాశారు. అయితే దీని వెనుక బాబులో నెలకొన్న కొత్త భయం కారణమని అంటున్నారు.
ఏపీలో చంద్రబాబు పరిపాలనను గమనించిన వారి ప్రకారం బాబు తాజా ఏలుబడి అంతా భజనమయం, అవినీతి మయం అయిన సంగతి తెలిసిందే. చంద్రన్న బాట, చంద్రన్న బీమా, చంద్రన్న సంచార వైద్య శాలలు, చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న విద్యా దీపం, చంద్రన్న స్వయం ఉపాధి, చంద్రన్న కాపు భవనాలు, చంద్రన్న విద్యోన్నతి, చంద్రన్న విదేశీ విద్య ఇలా పథకాలన్నింటికీ చంద్రబాబు తన పేరు పెట్టుకున్నారు. దీనిపై విపక్షాలు తప్పుపట్టినప్పటికీ ఆయన తగ్గలేదు. అయితే తాజాగా చంద్రబాబు తాజా ఆవేదన వెనుక ఆయన పథకాలను కేంద్రం సమీక్షించనుందనే ఆందోళన కూడా ఒక అంశమని పలువురు చర్చించుకుంటున్నారు.
ఇందుకు బీజేపీ గతంలో చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ పలువురు కొత్త అంచనాలు వెల్లడిస్తున్నారు. డబ్బులు కేంద్రానివి…ప్రచారం టీడీపీని అని బీజేపీ నేతలు అనేక సందర్భాల్లో ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఈ పథకాల తీరుపై తాము ఫిర్యాదు చేస్తామని కూడా తెలిపింది. మరోవైపు అన్ని పథకాలకు చంద్రన్న పేరేమిటని కూడా ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తాజా ఆందోళనకు కారణం చంద్రన్న పథకాలపై కేంద్రం నజర్ వేయడమే అయి ఉండవచ్చని అంటున్నారు. తన అవినీతి బయటపడుతుందనే భయంతోనే ఇలా ప్రధానికి లేఖ రాసి ఉంటారని అంటున్నారు.