భారతదేశ చరిత్రలో తొలిసారిగా, ఎవ్వరూ ఊహించని విధంగా, ఎవ్వరూ కనీసం ఆలోచన కూడా చెయ్యని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఆవిష్కరణ చెయ్యబోతున్నారు. రాష్ట్రంలోని లక్షలాదిమంది రైతులకు పంటసాయం కోసం ఎకరాకు ఎనిమిదివేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందజేయనున్నారు. కేసీయార్ ప్రభుత్వం తలపెట్టిన ఈ మహత్కార్యం పుణ్యాన కోటి యాభై లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలం కాబోతున్నది. పుడమితల్లి పచ్చని పట్టు చీరతో పులకరించబోతున్నది!
ఇంతటి గొప్ప పధకాన్ని అమలుచేసే ఏ ముఖ్యమంత్రి అయినా ఆ పధకానికి తనపేరు జోడించాలని ఆశించడం సహజం. పుచ్చిపోయిన, పురుగులు పట్టిన వందరూపాయల విలువ చెయ్యని సరుకులకు పార్టీరంగు సంచి, దానిమీద తన పేరు, ఫోటోలు పెట్టుకుని ప్రచారయావతో రగిలిపోయే ముఖ్యమంత్రులున్న ఈ రోజుల్లో పన్నెండువేలకోట్ల రూపాయల ఖర్చు అయ్యే ఈ బృహత్పథకానికి కేసీయార్ “రైతుబంధు” అని నామకరణం చేశారు తప్ప కేసీయార్ రైతుబంధు అని పెట్టలేదు. ఆయన ఆ పేరు పెట్టినా ఆక్షేపించేవారు, అధిక్షేపించేవారు ఎవరూ లేరు.
కానీ, కేసీయార్ గొప్ప దార్శనికుడు. ఆయనకు స్వకీర్తి కంటే ప్రజల ఆర్తి ముఖ్యం. తాను చేపట్టిన పధకాలు చరిత్రలో నిలిచిపోవాలని ఆయన ఆకాంక్ష. తనపేరు పెట్టుకుంటే, భవిష్యత్తులో మరో పార్టీ అధికారంలోకి వస్తే ఆ పధకాలను తొలగించే అవకాశం ఉన్నది. అప్పుడు లబ్ధిదారులు నష్టపోయే ప్రమాదం ఉన్నది. అందుకే ఆయన ముందుచూపుతో ఏ ఒక్క పధకానికి తన పేరు లేకుండా జాగ్రత్త వహిస్తున్నారు. గర్భిణీలకు అందిస్తున్న కేసీయార్ కిట్ అనే పధకానికి తప్ప మరే పధకానికి కేసీయార్ పేరు లేదు!
కేసీయార్ తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం నీటితీరువా పన్నును శాశ్వతంగా రద్దు చెయ్యడం, ఇప్పటికి ఉన్న బకాయిలను రద్దు చెయ్యడం. ఇది చాల సాహసోపేతమైన నిర్ణయం. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక నీటితీరువాను రద్దు చేసిన జ్ఞాపకం. ఆ తరువాత ఏమైందో తెలియదు. ఇప్పుడు తెలంగాణాలో మొదటిసారిగా ఆ పన్నును రద్దుచేసి రైతులపాలిటి ఆపన్నుడు అయ్యారు కేసీయార్. రైతుబాంధవుడిగా కేసీయార్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు.
నిన్ననే ఒక పోస్టింగ్ లో రాసాను… ప్రజలకోసం సంక్షేమ పధకాలను అమలు చెయ్యడానికి కావలసింది ఖజానా కాదు… ఖలేజా అని. ఇన్నాళ్లకు మళ్ళీ కేసీయార్ లో ఆ మొనగాడు కనిపిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీయార్ కు మనఃపూర్వక అభినందనలు.