ఘోరం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పరిధిలోగల మంటూరు వద్ద గోదావరి నదిలో లాంచీ మునిగింది. గాలి బీభత్సానికి గోదావరిలో 55 మంది ప్రయాణిస్తున్న బోటు మునిగిపోయింది. అందులో 15 మంది బతికి బయటపడితే మిగతా వాళ్లంతా నదిలో గల్లంతయ్యారు.
నిన్న మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఉదంతంలో మునిగిపోయిన బోటు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో 40 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో మొత్త 40 మంది గల్లంతయినట్లు అధికారులు భావిస్తున్నారు. గల్లంతైన వారి కోసం రెస్క్కూ టీమ్స్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ గోదావరిలో గాలిస్తున్నాయి, ప్రత్యేకంగా 20 మంది గజ ఈతగాళ్లను అధికారులు తీసుకొచ్చారు. మరో పక్క నేవీ హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. బోటు మునిగిన ప్రాంతాన్ని గుర్తించినప్పటిఆకీ అది ఎంత లోతుగా వెళలిందన్న విషయం ఇప్పటికీ స్పస్టంగా తెలియరాలేదు.
ఇది ప్రమాదమా..? లేక నిర్లక్ష్యమా..? అన్న ప్రశ్నలను ప్రస్తుతం ప్రతీ ఒక్కరిని తొలచివేస్తున్నాయి. ఒకవేళ గాలి బీభత్సానికి ఈ ప్రమాదం జరిగిందని, ఇది ప్రమాదమే అని మనం భావించినప్పటికీ దాని వెనుక అంతులేని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏం జరగదులే..! ఏం కాదులే..! అన్న ఒక భావన ఏ రోజు అయితే. మనందరినీ వీడుతుందో.. ఆ రోజే ప్రమాదాలను చాలా వరకు నివారించగలుతాం అంటున్నారు పలువురు.
ఏం కాదులే..! అన్న ఉద్దేశంతో.. ప్రమాదమే జరగదులే..! అన్న భావనతో లాంచీలో ఎక్కిన ఎవ్వరికీ కూడా లైఫ్ జాకెట్లు ఇవ్వని కారణంగా ఇవాళ ఇంత మంది ప్రాణాలు పోగొట్టుకున్నారన్నది స్పష్టంగా చెప్పొచ్చు.
గాలి బీభత్సం సృష్టించినప్పటికీ ప్రయాణికులకు రూల్స్ ప్రకారం లైఫ్ జాకెట్లను ఇచ్చి ఉండుంటే..! ఎంతో మంది తమ ప్రాణాలను ఖచ్చితంగా కాపాడుకుని ఉండేవారు.. కానీ, అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కేవలం ఈత వచ్చిన వాళ్లు మాత్ర.. అది కూడా అదృష్టవశాత్తు లోపల కిటికీలు.. తులపులు వేసుకొని కూర్చోకుండా బయటవైపుకు కూర్చొని ఉన్న వాళ్లు మాత్రమే వెంటనే నదిలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని తమ ప్రాణాలను కాపాడుకోగలిగారు. కానీ, మిగిలిన వారంతా లోపలే ఇరుక్కుపోయి ఉన్నారు. ఈ ప్రమాదంలో బోటు యజమాని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. బోటులో ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఏదేమైనా ఇటీవల కాలంలో ఏపీలో ఇటువంటి సంఘటనలు వరుసగా చోటుచేసుకోవడంతో ప్రభుత్వ అనాలోచిత లోపం కూడా కొంతమేర ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.