సచివాలయంలో తన ఛాంబర్లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సమకాలిన రాజకీయ, పరిపాలన పరమైన అంశాలపై మంత్రి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడారు. తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు.ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తకరమైన విషయాలను ఆయన వెల్లడించారు. ‘కేసీఆర్’ నినాదంతో రాబోయే ఎన్నికలకు వెళ్తామని కే తారకరామారావు అన్నారు. తెలంగాణకు పర్యాయ పదం కేసీఆర్ అని… కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది…. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని ప్రజలందరికి తెలుసునని, అందుకే ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు.
రాబోయే ఎన్నికల తర్వాత కూడా సీఎంగా కేసీఆర్ను చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజార్టీని సాధిస్తుందని, ఎవరి మద్దతు అవసరం లేకుండా స్వంత మెజార్టీ సాధిస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందనే ధీమా వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.. అలా జరక్కపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాలను నడిపిస్తారని, మరో పది కాలాలపాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. రైతు బంధు పథకానికి అద్బుతమైన స్పందన వస్తుందని…. ఎమ్మెల్యేగా తన పది సంవత్సరాల జీవితంలో ప్రజల నుంచి అత్యంత బ్రహ్మండంగా స్పందన వచ్చిన పథకం ఇదే అన్నారు.
దేశం మొత్తానికి ఆదర్శం రైతుబంధు పథకం మారిందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి, డిమాండ్ కూడా మొదలైందని తెలిపారు. ఎమ్మెల్యేగా.. గత పది సంవత్సరాల నా రాజకీయ జీవితంలో రైతుబంధు పథకానికి వచ్చిన స్పందన మరే దానికి చూడలేదని పేర్కొన్నారు. ఒక ప్రభుత్వ పథకానికి ఇంత స్పందన రావడం తాను ఇదే మొదటి సారిగా చూస్తున్నానని కేటీఆర్ వివరించారు.