ఇస్లాం మతస్థులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ రంజాన్. రంజాన్ మాసంలో నెలంతా ఉపవాసం ఉండి వారి ప్రేమను, భక్తిని చాటుకుంటారు ముస్లింలు. ఉదయాన్నే నిద్రలేచి స్నానాలను ఆచరించి మూడు నుంచి ఐదు గంటల సమయంలో పలహారం లేదా భోజనం తీసుకుని ప్రార్ధనలు చేస్తారు. సాయంత్రం ఆరు నుంచి ఆరు గంటలా 30 నిమిషాల లోపల ఉప వాసం ముగించి భోజనం తీసుకుంటారు. ఆ తరువాత మళ్లీ ప్రార్ధనలు చేస్తారు. అయితే, ఉపవాసం సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. ఇలా పూర్తిగా 30 రోజులపాటు రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటారు.
ఈ రంజాన్ మాసంలో పేద, ధనిక అనే వ్యత్యాసం లేకుండా ప్రతీ ఒక్కరు ఒకే సమయంలో భోజనం చేస్తారు. ఒకేరకమైన భోజనాన్ని స్వీకరిస్తారు. మనుషుల మధ్య వ్యత్యాసం అనేది లేకుండా 30 రోజుల ఉపవాసం, ప్రార్ధనలు చేయడం జరుగుతుంది. ఈ సమయంలోనే ఎక్కువగా దాన ధర్మాలు, భోజనాలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి పేద, ధనిక అనే తేడా లేకుండా ఉపవాసం ముగించుకున్న సమయంలో ఏదైతే లభిస్తుందో.. దాన్నే ముస్లింలు భుజిస్తారు. ఈ రకంగా మనుషులంతా ఒక్కటే అనే భావనను సూచిస్తారు.