పల్లెల్లో పట్టణ వసతులు కల్పించే లక్ష్యంతో చేపడుతున్న రూర్బన్ పథకంలో వేగం పెంచాలని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. సచివాలయంలో రూర్బన్, ఉపాధి హామీతో పాటు ఉద్యోగుల బదిలీలపైనా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో 4, రెండో విడతలో 3, మూడో విడతలో 9 క్లస్టర్లను రూర్బన్ పథకంలో భాగంగా తీసుకోగా…దాదాపు 150 కోట్లతో 349 గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపడుతోంది. ఈ పనుల్లో వేగం పెంచడం ద్వారా అదనపు క్లస్టర్లను కేంద్రం నుండి పొందే అవకాశం ఉండటంతో…ఆ దిశగా అధికారులకు మంత్రి జూపల్లి దిశానిర్దేశం చేశారు. 2020 వరకు గడువు ఉన్నప్పటికీ…ఆ లోపే పనులు పూర్తి చేసేలా కార్యాచరణ సిద్దం చేయాలని ఆదేశించారు. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పార్కులు, క్రీడా మైదానాల్లాంటి సౌకర్యాలను కూడా గ్రామాల్లో ఏర్పాటు చేయాలన్నారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఉపాధి హామీలో నిర్లక్ష్యం వద్దుఉపాధి హామీ పథకం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి పని కల్పించేందుకు చిత్తశుద్దితో పనిచేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కనీసం 60 శాతం మంది కూలీలకు వందరోజుల పని కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. గత ఏడాది ఉపాధి నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పటికీ …మరింత ఎక్కువగా పనిచేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర సగటు పనిదినాల కన్నా ఏ గ్రామంలో తక్కువ పనిదినాలు నమోదైనా క్షేత్రస్థాయి సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే సమయంలో ప్రతి కూలీకి సగటున 50 రోజుల కన్నా ఎక్కువ పని కల్పిస్తే ప్రోత్సాహకాలు అందించేలా ప్రతిపాదనలు సిద్దం చేయాలని ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్లను ఆదేశించారు. ఈ చర్యలతో దేశంలోనే తెలంగాణాను ఉపాధి పనుల్లో అగ్రగామిగా నిలిపేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఉపాధి పనుల్లో వెనుకబడితే ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఓలతో పాటు… ఎంపీడీఓలు, డిఆర్డీఓలపై కూడా చర్యలు తప్పవన్నారు.
లాంగ్ స్టాండింగ్ ఎంపీడీఓల బదిలీలకు చర్యలు తీసుకోండి.మండల విస్తరణాధిరుకాలకు ఎంపీడీఓలుగా పదోన్నతులు కల్పించడంతో పాటు… లాంగ్ స్టాండింగ్ ఎంపీడీఓల బదిలీల ప్రక్రియను కూడా ప్రారంభించాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగుల బదిలీలను మాత్రం ఎన్నికల తర్వాత చేపట్టాలని నిర్ణయించారు.