తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనపై మరోమారు విపక్షాలు తమ అక్కసును వెళ్లగక్కాయి. అదే సమయంలో మరోమారు కొన్ని మీడియాలు దుష్ప్రచారం మొదలుపెట్టాయి. అయితే అసలు నిజాలు వేరేనని పలు వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7జోన్లు, 2మల్టీ జోన్లు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలసి ఒక లేఖను అందించారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను నార్త్ బ్లాక్ లోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కలిసి ఈ వినతి చేశారు. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు.
అయితే, ప్రధాని అపాయింట్మెంట్ దొరకకపోవడం వల్లే సీఎం కేసీఆర్ హైదరాబాద్కు తిరుగుపయనం అంటూ వార్తలు వచ్చాయి. కొన్ని మీడియాలు దీన్ని ప్రచారంలో పెట్టాయి. అయితే వాస్తవాలు వేరేనని సమాచారం. ప్రధానమంత్రి కార్యాలయం వార్తల ప్రకారం …ప్రధాని మోడీ రెండు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళుతున్నందున అపాయింట్మెంట్ కుదరలేదు. రెండు రోజులు ఇండోనేషియా, సింగపూర్లలో ప్రధాని పర్యటించనున్నారు. మలేసియాలోనూ ప్రధాని అనధికార పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో మోడీ ఆయా దేశాధినేతలతో పాటుగా పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశం కానున్నారు. పెట్టుబడుల గురించి చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్తో ప్రధాని భేటీ కుదరలేదు. ఈ అంశాలను విస్మరించి విమర్శలు చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.