కాంగ్రెస్ నేతలు అవినీతి ,కుటుంబ పాలన గురించి మాట్లాడటం చిత్రంగా ఉందని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు. కాంగ్రెస్ నేతల విమర్శలు చవకబారుగా ఉన్నాయని ఆయన అన్నారు. `కాంగ్రెస్ది కుటుంబ పాలన కాదా? జానారెడ్డి తన కొడుకును కూడా నల్గొండ మీటింగ్లో తనతో పాటు కూర్చోబెట్టుకోవడం కుటుంబ పాలన కాదా? ఉత్తమ్ ,ఆయన భార్య ఎమ్మెల్యేలు కావడం కుటుంబ పాలన కాదా? కోమటిరెడ్డి బ్రదర్స్ ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీలు కావడం కుటుంబ పాలన కాదా? అలాంటి వాళ్లకు కేసీఆర్ కుటుంబం అంటూ విమర్శలు చేసే
హక్కుందా?“ అని సూటిగా ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబం అంటే త్యాగాలకు నిదర్శనమని అన్నారు.కాంగ్రెస్ నేతలు తాము అవినీతికి పాల్పడ లేదని ఏదైనా గుడిలో ప్రమాణం చేయగలరా అని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. `మంత్రి జగదీశ్ రెడ్డి ఎత్తుపై కూడా కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు. రాజకీయాలు చేయడానికి ఎత్తులతో ఏం పని? జగదీశ్ రెడ్డి ఈ సారి 50 వేల మెజారిటీతో గెలవబోతున్నారు. అంత మెజారిటీతో గెలవకపోతే దేనికయినా సిద్ధం. జానా, ఉత్తమ్ కూడా ఈ సారి ఓడటం ఖాయం“ అని స్పష్టం చేశారు. ఎపుడు ఎన్నికలు వస్తాయా టీఆర్ఎస్కు ఓట్లు ఎపుడు వేద్దామా అని రైతులు ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు.
అన్నివర్గాలకు మేలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వలే గతంలో ఏ ప్రభుత్వం పని చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు తమ భాషను మార్చుకోవాలని సూచించారు.ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల దిగజారుడు రాజకీయాల్ని ఖండిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు మాట్లాడిన భాషను సభ్య సమాజం హర్షించదని అన్నారు. కాంగ్రెస్ పని అయిపొయిందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ పార్టీదే విజయమని ఆయన స్పష్టం చేశారు.