16వ నెంబర్ జాతీయ రహదారిపై దెందులూరు మండలం సత్యనారాయణ పురం వద్ద ఆటోను కారు ఢీ కొన్న ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి. భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన కూలీలు సత్యనారాయణపురంలో వరి నాట్లు వేయడానికి వెళ్లారు.
జాతీయ రహదారి నుంచి సత్యనారాయణపురం వైపు మలుపు తిరుగుతున్న ఆటోను ఏలూరు నుంచి గుండుగొలను వైపు వెళ్తున్న కారు ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సత్యనారాయణతో పాటు మత్త ఝాన్సీ, సేనాపతి సుశీల, పొప్పరి లక్ష్మి, పెదపాటి మంగ, మరడాని రమణ, మణెమ్మ, నారాయణపురం పార్వతి, కారులో ప్రయాణిస్తున్న ప్రియకి గాయాలయ్యాయి. వీరిని రహదారి భద్రత పోలీసులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.దెందులూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.