తమ పదవి కాలం పూర్తవుతున్నప్పటికీ గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని సర్పంచ్లుగా కొనసాగించాలని జగిత్యాల జిల్లా సర్పంచులు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం జగిత్యాల జిల్లాకు చెందిన సర్పంచులు ఆ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దురిశెట్టి రాజేష్ నేతృత్వంలో హైదరాబాదుకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా సర్పంచులు ఎంపీ కవితకు తమ పరిస్థితిని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి సర్పంచ్ లుగా పనిచేసే అవకాశం కలిగినందుకు మాకు ఆనందంగా ఉందని అన్నారు. అయితే ఒక ఏడాది పాటు ఉమ్మడి ఏపీలో పనిచేయడం దురదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి చేస్తున్న కృషి వల్ల సర్పంచులుగా మాకూ ప్రజల్లో ఎనలేని గౌరవం లభిస్తున్నదని సర్పంచులు చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రజారంజకమైన పాలనను చూసి ఇతర పార్టీలను వదిలి టీఆర్ఎస్ లో చేరామని కొందరు సర్పంచ్ లు తెలిపారు. మున్సిపాలిటీల్లో విలీనమైన పంచాయతీల నిధులను నిలిపివేశారని, ఇది అభివృద్ధి కి ఆటంకం కలిగిస్తుందని కొందరు సర్పంచులు వివరించారు. ఆ నిధులను విడుదలయ్యేలా చూడాలని కోరారు. పర్సన్ ఇన్చార్జీలను నియమించడం వల్ల పూర్తిస్థాయిలో గ్రామాల పరిపాలన అస్తవ్యస్తంగా తయారవుతుందని సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక గ్రామ కార్యదర్శి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పరిశీలకులు ఛార్జీల పదవీకాలం పూర్తవుతుందని కొనసాగించాలని సర్పంచ్ లు ఎంపి కవితకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలన్నింటిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ కవిత సర్పంచ్ లకు తెలిపారు.